ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం వైపు కదులుతూ మంగళవారం తుఫానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ ద్వారా వాతావరణ వివరాలు వెల్లడించింది. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. ఆ తర్వాత, ఇది మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఆదివారం, సోమవారం కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా తేలికపాటి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల ఆదివారం సాయంత్రం, రాత్రితో పాటు సోమవారం రాత్రి వరకు.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అల్లూరి, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలైన అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లా పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం రాత్రి రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మరింత విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa