మణిపూర్లో చిక్కుకున్న 157 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ ఏపీ భవన్ ప్రకటన విడుదల చేసింది. పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి రెండు అదనపు విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక విమానంలో హైదరాబాద్కు, మరో విమానంలో కోల్కతాకు తరలిస్తున్నట్లు ఏపీ భవన్ పేర్కొంది. హైదరాబాద్కు తరలించే వారిని వారి స్వస్థలాలకు చేరవేసేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోల్కతాకు చేరుకునే విద్యార్థులను కనెక్టింగ్ విమానాల ద్వారా హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మణిపూర్ ప్రభుత్వ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరిపి వారిని తరలించేందుకు పూర్తిస్థాయి సహకారం ఇవ్వాలని కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా 160 మంది విద్యార్థుల వివరాలను సేకరించినట్లు తెలిపారు. 108 మంది విద్యార్థులు నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. మిగిలిన వారిని కోల్కతా మీదుగా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోల్కతాలో విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ భవన్ అధికారి రవి శంకర్ను నియమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa