టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం దగ్గరకు వెళ్లగా.. పలువురు లాయర్లు ఆయన్ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదని.. కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారన్నారు. హైకోర్టు బెంచ్ హామీపై లోకేష్కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.
అంతకముందు లోకేష్ను మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను లోకేష్తో చెప్పుకున్నారు. అనంతరం లోకేష్ను 50వ డివిజన్ ప్రజలు కలిశారు.. టిడ్కో ఇళ్లకు సంబంధించి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో తమ డివిజన్లో 1200 మంది టిడ్కో ఇళ్లకోసం రూ.లక్ష చొప్పున చెల్లించామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఇళ్లను పూర్తిచేసి తమకు అందించలేదన్నారు. అలాగే వార్డుల్లో మంచినీరు సరిగా రావడంలేదని.. నీటి సమస్య ఇబ్బందిగా ఉందన్నారు.
అంతేకాదు బీసీ కార్పొరేషన్లో లోన్లు తీసుకున్న 18 మంది క్లియర్ చేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్, డ్రైనేజి సమస్యలు ఉన్నాయని.. 50వ వార్డులో పార్కు, లైబ్రరీ ఏర్పాటు చేయాలని లోకేష్ను కోరారు. తమ సమస్యల పరిష్కరించేలా చూడాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంలో జగన్ సర్కార్ విఫలమైందన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని.. మిగిలిన పనులు పూర్తి చేసి ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ద.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో లేదని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50వ డివిజన్ సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. లోకేష్ పాదయాత్ర ఇవాళ ఎస్టీబీసీ కళాశాల నుంచి మొదలై.. కొండారెడ్డి బురుజు, ఓల్డ్ సిటీ మీదుగా జోహారపురం వరకు సాగనుంది.. పాదయాత్ర అనంతరం లోకేష్ నగర శివారులోని వెంకాయపల్లె పుల్లయ్య కళాశాల వద్ద బస చేయనున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa