ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెడన నుంచి బరిలోకి దిగుతా,,,బూరగడ్డ వేదవ్యాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:48 PM

టీడీపీ నేత ఒకరు మాత్రం తనను తమ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. పెడన నుంచి టీడీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు బూరగడ్డ వేదవ్యాస్ ప్రకటించారు. అధినేత చంద్రబాబు నాయుడు పెడన సీటుపై ఇంకా ఎవరికీ హామీ ఇవ్వలేదని.. కానీ తాను మాత్రం ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు మనసులో మాట చెప్పారు.


చంద్రబాబు కూడా తన కోరికను కాదనరనే నమ్మకం ఉందని.. త్వరలోనే అధినేతని కలిసి నియోజకవర్గంలో పరిస్థితులు వివరిస్తానన్నారు. స్థానికంగా రాజకీయ పరిణామాలు, సమీకరణాలతో ఈ సారి ఇక్కడ నుంచి పోటీ‌‌‌ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని.. తమ అధినేత కూడా తనను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉందన్నారు.


పెడన నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జోగి రమేష్ పోటీచేసి టీడీపీ అభ్యర్థి కాగిత వెంకట్రావుపై విజయం సాధించారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి బూరగడ్డ వేదవ్యాస్ పోటీ చేయగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన కాగిత వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. 2019లో కాగిత వెంకట్రావు తన కుమారుడు కృష్ణ ప్రసాద్‌ను పోటీ చేయగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జోగి రమేష్ చేతిలో ఓటమి ఎదురైంది. పెడన టీడీపీ ఇంచార్జ్‌గా కృష్ణ ప్రసాద్‌ ఉన్నారు. ప్రస్తుతం జోగి రమేష్ ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు మినహా టీడీపీకి దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లు ఉన్నారు. చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంఛార్జ్‌లను నియమించారు. ఎన్నికల నాటికి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని.. పని తీరు మెరుగ్గా ఉన్నవాళ్లకు టికెట్ ఖాయమని కుండ బద్దలు కొట్టారు. తాను కచ్చితంగా నియోజకవర్గంలో పనితీరును పరిగణలోకి తీసుకుంటానని తేల్చి చెప్పారు. ఇంఛార్జ్ పనితీరు సరిగా లేని పక్షంలో కొత్తవారికి, సమర్థులకు అవకాశం ఇస్తాను అన్నారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. కొందరు నేతల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోవాలన్నారు.


మరోవైపు టీడీపీకి వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్థుబాటు పెద్ద సమస్యలా మారనుంది. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారు. ఇంఛార్జ్ ఉన్నా సరే పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని చెప్పారు. అయినా సరే నేతలు తీరు మాత్రం మారడం లేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa