ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయంలో వీడియో రికార్డు ,,,తిరుమలలో కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:48 PM

ఇటీవల తెలుగురాష్ట్రాల్లోని పలు దేవాలయాలలో వివాదాస్పద కార్యక్రమాలు చోటు చేసుకొంటున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వీడియో రికార్డు చేయడం కలకలం రేపింది. మూడంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి భక్తుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విచారణ చేపట్టింది. ఆలయం లోపలి సీసీ కెమెరా విజువల్స్‌ను టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నారు.


ఇదిలావుంటే తిరుమల శ్రీవారి ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తుంటారు. సెల్‌ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్బందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్‌తో తిరిగినా.. సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొనడం గమనార్హం.


ఈ క్రమంలో తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌ఓ) నరసింహ కిశోర్‌ వెల్లడించారు. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం చట్టపరంగా నేరం అనే విషయం భక్తులందరికీ తెలుసన్నారు. ఈ మేరకు సీవీఎస్‌ఓ నరసింహ కిశోర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో దాదాపు 2 గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. అదే సమయంలో సదరు భక్తుడు లోపలికి తీసుకెళ్లిన పెన్‌ కెమెరాతో వీడియో చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నామని నరసింహ కిశోర్ పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో పాటించాల్సిన నిబంధనల గురించి భక్తులందరికీ తెలుసని.. అయినప్పటికీ ఇలా చేయడం బాధాకరమన్నారు. సీసీటీవీల ద్వారా భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని సీవీఎస్‌ఓ తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa