ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోచా తుఫాన్ ప్రభావం,,,ఏపీలో కొనసాగుతున్న వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:49 PM

ఏపీలో ఇప్పటికే ఆవర్తనం ప్రభావంతో వానలు కురుస్తుండగా.. ఇప్పుడు మోచా తుఫాన్ ముప్పు కూడా వెంటాడుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మంగళవారానికి మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత తుఫాన్‌గా మారి ఉత్తరంగా పయనించి ఉత్తర అండమాన్‌ సముద్రం.. మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


ఈ నెల 10న రాత్రి లేదా 11న తుఫాన్‌గా మారుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ ఈశాన్యంగా పయనించి తీవ్ర తుఫాన్‌, ఆ తర్వాత అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈ నెల 14న మయన్మార్‌ దగ్గర తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఈ తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనుండటంతో తూర్పుతీర రాష్ట్రాల్లో వర్షాలు పెరుగనున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.


అయితే ఈ మోచా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉండదని భావిస్తున్నారు. కాకపోతే అల్పపీడనం, వాయుగుండం సమయంలో మాత్రం కొంతమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో.. ఈ ప్రభావంతో 2, 3 రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వానలు పడతాయంటున్నారు.


ఆదివారం కూడా కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వానలు పడ్డాయి. అంతేకాదు రానున్న రెండురోజుల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేశారు. తిరుపతిలో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం పడుతున్న కారణంగా ముందు జాగ్రత్తగా వివిధ ప్రాంతాలలో కరెంటు సరఫరాను నిలిపివేశారు. అంతేకాదు శనివారం తిరుమలలో కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది.


తుఫాన్ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వర్షాలతో పంటనష్టం పోయామని.. మళ్లీ వానలు కురిస్తే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ధాన్యం తడిచిపోయాయని.. మళ్లీ వానలు పడితే ఇంకా నష్టపోతామంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఈసారి విచిత్రంగా ఎండాకాలంలో వర్షాలు దంచికొట్టడం విశేషం. ఎండాకాలంలో సాధారణంగా అకాల వర్షాలు కురిసినా.. ఏదో ఒకటి, రెండు ప్రాంతాల్లోనే ప్రభావం ఉంటుంది. అయితే ఏప్రిల్‌ 23 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. అయితే మరో నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ ఎండలు, వేడి గాలుల ప్రభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa