కాకినాడ జిల్లా పెద్దాపురం దగ్గర విషాధకర ఘటన చోటు చేసుకొంది. సుమారు 174 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో మూడు టన్నుల వరకు చేపలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు 500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే రాఘవమ్మ చెరువులో మత్స్యకార సంఘం 174 ఎకరాల మేర చేపల సాగు చేపట్టింది. సోమవారం సుమారు 50 టన్నుల చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులు సిద్ధమై చెరువు వద్దకు వెళ్లారు. అప్పటికే కొన్ని వందల చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో మత్స్యకారులు వెంటనే సంఘం నేతలు, అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఘటనా స్థలానికి చేరుకుని చెరువును పరిశీలించారు. చేపల మృతి కారణాలపై విచారణ జరిపాలని, భారీగా నష్టపోయిన లీజుదారులకు న్యాయం చేయాలని హౌసింగ్ చైర్మన్ దొరబాబు మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
సుమారు 3 టన్నుల చేపలు చనిపోయాయని.. వీటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే చెరువులో విష ప్రయోగం జరిగిందా? లేక వడదెబ్బ కారణంగా ఏర్పడ్డ ఆక్సిజన్ లోపమా? అనే దానిపై విచారణ జరుపుతున్నామని మత్స్యశాఖాధికారి కె.ప్రకాశరావు తెలిపారు. చెరువు నీటిని, మృతిచెందిన చేపలను ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa