తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో వరుస అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటో తేలింది. అదే ఊరికి చెందిన కీర్తి ఇదంతా చేసినట్లు తేల్చారు.. తల్లిపై ద్వేషంతో బంధువుల ఇళ్లు, బీరువాలకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. ఊరిలో మొదట గడ్డి వాముకు కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టారు. ఇదే అదునుగా భావించిన కీర్తి.. ఎదురింట్లో ఉన్న గడ్డివాముకు నిప్పు పెట్టినట్లు తేలింది. ఆ తర్వాత కీర్తి వరుసగా తన బంధవుల ఇళ్లలో బీరువాలకు, బట్టలకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఊరిలో ఏదో జరిగిపోతోంది అంటూ ప్రచారం జరిగింది.
ఈ వరుస ఘటనల సమయంలో కూడా కొందరు అత్యాశకు పోయారు. బట్టలు కాలిపోయిన వారికి కొంతమంది ఆర్థికసాయం అందించారు. గ్రామనికి చెందిన మరో ఇద్దరు ఆర్థిక సాయం తమకు కూడా అందిస్తారని అత్యాశకు పోయారు.. తమ ఇంట్లో పాత బట్టలకు నిప్పు పెట్టారు. వారు కూడా కీర్తితో పాటూ అత్యాసకు పోయి అరెస్ట్ అయ్యారు. ఈ మిస్టరీ వీడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త శానంబట్లలో కొంతకాలంగా వరుసగా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఒకే కుటుంబానికి చెందిన పిల్లపాళెం దాయాదులైన శివశంకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవిల ఇళ్లు, పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గడ్డివాములు, బీరువాల్లో మంటలు రేగడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనల్లో బట్టలతో పాటూ డబ్బులు, బంగారం కూడా దగ్థం అయ్యాయి. ఇలా వరుస ఘటనలు జరగడంతో గ్రామానికి క్షుద్రపూజలు జరిగాయని అనుమానించారు. స్థానికులు వెంటనే మంత్రగాళ్లను ఆశ్రయించి.. ఊరిలో గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఈ పూజలు కొనసాగుతున్న సమయంలోనే మరో ఇంట్లో మంటలు రేగాయి.
ఈ ఘటనలకు తోడు ఓ వ్యక్తి గ్రామానికి వచ్చి భిక్షాటన చేశాడట. తనకు తక్కువ నగదును భిక్షగా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించాడట.. అతడు ఏదైనా క్షుద్రపూజలు చేసి ఉండొచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఈ వరుస ఘటనలపై ఆరా తీశారు. క్లూస్ టీమ్లను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ముందస్తు జాగ్రత్తగా కొంతమంది పోలీసుల్ని కూడా మోహరించారు.
అక్కడితో ఈ మిస్టరీ ఆగలేదు.. 40 ఏళ్ల క్రితం కూడా కొత్తశానంబట్లలో ఇదే తరహాలో ఘటనలు జరిగాయని ఊరిలో పెద్దవాళ్లు చర్చించుకున్నారు. తాంత్రిక ప్రయోగం వల్ల వరుసగా ఇళ్లలో మంటలు చెలరేగాయని ప్రచారం జరిగింది. అయితే చివరికి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందని తెలిసి స్థానికులు కూడా అవాక్కయ్యారు. కీర్తి తల్లిపై ద్వేషంతో ఇదంతా చేసిందని తేలడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa