ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతా,,,కేశినేని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 31, 2023, 07:24 PM

విజయవాడ ఎంపీ కేశినేని నాని  తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనకు టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదని.. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానేమో అని వ్యాఖ్యానించారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని కేశినేని నాని క్లారిటీ ఇచ్చారు.  'నా మాటల్ని పార్టీ ఎలా తీసుకున్నా నాకు భయం లేదు. పార్టీ టికెట్ ఇస్తుందా? నేను ఎంపీ అవుతానా? అనే భయం లేదు. నాకు ట్రాక్ రికార్డు ఉంది. నేను చేసినన్ని పనులు దేశంలో ఏ ఎంపీ చేయలేదు' అని కేశినేని నాని స్పష్టం చేశారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి కేశినేని నాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.


కేశినేని వ్యాఖ్యల విషయం అలా ఉంటే.. ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా.. వైసీపీ కీలక నేత ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి కేశినేని నానిపై పొగడ్తల వర్షం కురిపించారు. కేశినేని నాని చాలా మంచి వ్యక్తి అని.. ఆయన వైసీపీ వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. కేవలం ఆయనే కాదు.. ఇటీవల వైసీపీలోని కొందరు నేతలు కేశినేని నానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఆమధ్య కేశినేని నాని నందిగామ జిల్లాలో పర్యటించారు. అప్పుడు అక్కడి వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చాలామంచి పనులు చేస్తున్నారని కొనియాడారు. అటు జగన్ మోహన్ రావు కూడా కేశినేని నానిపై ప్రశంసలు కురిపించారు. ఆ వ్యవహారం టీడీపీలో రచ్చకు కారణమైంది. నందిగామ టీడీపీకి చెందిన ఓ వర్గం నానిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.


తనపై ఫిర్యాదు చేయడాన్ని కేశినేని నాని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తాను ఎంపీగా తన నియోజకవర్గంలో తిరిగితే తప్పా అని ప్రశ్నించారు. మంచి చేసినవారిని పొగిడితే తప్పా అని నిలదీశారు. బెజవాడ అభివృద్ధి కోసం ముళ్ల పందిని కూడా ముద్దు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. తాజాగా కూడా.. టీడీపీకి చంద్రబాబు, వైసీపీకి జగన్ నాయకులని.. వారిద్దరికి వైరం ఉంటే తమకేంటని వ్యాఖ్యానించారు. కేశినేని వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa