కాకినాడజిల్లా కొండెవరంలో వృద్ధులకు చెల్లించాల్సిన సామాజిక పింఛను సొమ్ము పంపిణీ చేయకుండా ఆ సొమ్ముతో ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ పరారైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా వీరబాబు విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతీనెలా ప్రభుత్వం నుంచి వచ్చిన పింఛను డబ్బులను వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఆయా వలంటీర్లకు సరఫరా చేస్తుంటారు. ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి వలంటీర్ల ద్వారా పింఛను సొమ్ము లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది. వీరబాబు కొంత సొమ్మును వలంటీర్లకు బదిలీచేసి, మిగతా రూ.1.50 లక్షలను వలంటీర్లకు ఇవ్వకుండా గైర్హాజరయ్యాడు. రెండో తేదీ దాటినా ఇంకా తమ చేతికి పింఛను సొమ్ము అందకపోవడంతో లబ్ధిదారులు గ్రామ సర్పంచ్ వేమగిరి చెల్లాయమ్మ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధికారులు వీరబాబు కోసం గాలించగా అందుబాటులో లేడని తేలింది. గతంలో కూడా ఒకసారి ఈ ఉద్యోగి పింఛను డబ్బులతో పరారై, తిరిగి డబ్బులు జమచేసి విధుల్లో చేరాడు. అధికారులు మొదటి తప్పుగా భావించి అవకాశం కల్పించారు. వీరబాబు కోసం విచారణ నిర్వహించగా అందుబాటులో లేకపోవడంతో గామ కార్యదర్శి ముసలయ్య ఎంపీడీవో అబ్రహం లింకన్కు ఫిర్యాదు చేసిన అనంతరం వీరబాబుపై చర్యలు కోరుతూ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa