ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రమాదం తనను కలిచి వేసింది: ప్రధాని నరేంద్ర మోడీ

national |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 09:33 PM

ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనను కలిచి వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తొలుత ఘటనాస్థలిని పరిశీలించిన మోదీ.. ఆ తర్వాత బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని హెచ్చరించారు.


"ఇది చాలా బాధాకరమైన సంఘటన. రైలు ప్రమాదం నా మనసును కలిచివేసింది. గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందిస్తుంది. గాయపడిన వారికి అండగా ఉంటాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించాం. ఇందులో దోషులుగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తాం. ట్రాకుల పునరుద్ధరణకై రైల్వే పనిచేస్తోంది. బాధితులకు రక్తదానం చేసిన వారిని అభినందిస్తున్నా. రాత్రంతా సహాయకచర్యల్లో పాల్గొన్నవారిని అభినందిస్తున్నా. బాధితులను ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేకపోయాయి."


- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


అంతకుముందు ఘటనాస్థలంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ పర్యటన కోసం ఇండియన్ ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లో శనివారం మధ్యాహ్నం బాలేశ్వర్కు చేరుకున్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని.. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని పరిశీలించారు. మోదీ వెంట కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ ఉన్నారు. అక్కడ అధికారులను అడిగి ప్రమాద వివరాలను మోదీ తెలుసుకున్నారు.


ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమేనని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. లూప్లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొట్టిందని తెలిపింది. మెయిన్‌ లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్‌ ఇచ్చారని.. అయితే ఆ రైలు మాత్రం పొరపాటున లూప్లైన్లోకి వెళ్లిందని వెల్లడించింది. సౌత్ ఈస్ట్ సర్కిల్ కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa