గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు, కార్యరూపంలోకి ప్రతిపాదనలు అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు. పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని వివరాలనూ అధికారులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కు వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది సార్లు ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించి.. 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని అధికారులు వివరించారు. వీటి ద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని వెల్లడించారు.
2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా.. 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని.. కానీ అందులో 10 శాతం కూడా కార్యరూపం దాల్చలేదని అధికారులు.. ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని.. 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు.
రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు పనులు మొదలు పెట్టనున్నాయని అధికారులు సీఎం జగన్కు వివరించారు. జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024 లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్ కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీని వల్ల విశాఖ నగరం ఖ్యాతి పెరుగుతుందని.. ఐటీకి చిరునామాగా మారుతుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలతో పాటు.. ఇతర సంస్థలనూ విశాఖకు ఆహ్వానించాలని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa