ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కోర్టు ఆవరణలోనే గ్యాంగ్స్టర్ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి.. హత్యకేసులో నిందితుడిగా ఉన్న సంజీవ్ జీవా అనే గ్యాంగ్స్టర్పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. లాయర్ వేషధారణలో వచ్చిన దుండగుడు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో అక్కడ ఉన్న వారు అంతా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. సంజీవ్ జీవా కుప్ప కూలిపోయాడు. ఈ ఘటనలో అక్కడే ఉన్న మరికొంత మంది కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. లక్నో సివిల్ కోర్టు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ అతని సోదరున్ని కాల్చి చంపిన 2 నెలలకే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాల్పుల్లో చనిపోయిన గ్యాంగ్స్టర్ సంజయ్ జీవా.. పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో క్రిమినల్ గ్యాంగ్ను నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి.. గ్యాంగ్స్టర్ సంజయ్ జీవాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో ముక్తార్ అన్సారీ ప్రధాన నిందితుడిగా ఉండగా.. సంజయ్ జీవా రెండో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు సంజీవ్ జీవాను బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో పక్కన ఉన్నవారికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
దాదాపు 2 నెలల క్రితం ఉత్తర్ప్రదేశ్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అతీక్.. అతని సోదరుడిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. జైలుకు తీసుకెళ్లేందుకు వారిద్దరినీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మీడియా వారిని ప్రశ్నించింది. నిందితులు మీడియాతో మాట్లాడుతుండగానే.. జర్నలిస్టుల ముసుగులో వచ్చిన కొంతమంది అతీక్, అతని సోదరుడిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, జర్నలిస్టులు భయంతో పక్కకు జరిగారు. అక్కడ ఉన్న మీడియా కెమెరాల్లో ఈ కాల్పులకు సంబంధించిన వీడియోలు రికార్డ్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa