ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 28కి వాయిదా పడిన లింగమనేని కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:55 AM

వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, ఇంటి జప్తు వ్యవహారంలో వాదనలు వినిపించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ  దాఖలు చేసిన అప్పీల్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆదేశాలిచ్చారు. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలతో విజయవాడ కరకట్ట రోడ్డు పక్కన ఉన్న వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌ ఇంటిని (టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు) జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటి జప్తునకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును సీఐడీ ఆశ్రయించింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌ తరఫు న్యాయవాది విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ అనుబంధ పిటిషన్‌ను జూన్‌ 6న ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ లింగమనేని రమేశ్‌ హైకోర్టులో అప్పీల్‌ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ఈ ఏడాది మే 18న ఏసీబీ ఇంచార్జి కోర్టు తమకు నోటీసులు ఇచ్చిందన్నారు. ఒకసారి నోటీసులు జారీ చేసిన తరువాత అభ్యంతరాలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకుండా జప్తు విషయంలో ఏసీబీ కోర్టు ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. అభ్యంతరాలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వాలన్న తమ అభ్యర్ధనను ఏసీబీ కోర్టు కొట్టివేసిందన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్ధించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి... వాదనలు వినిపించేందుకు అవకాశం ఇస్తే తప్పేముందని సీఐడీని ప్రశ్నించారు. సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపిస్తూ.... ఇంటి జప్తు వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయన్నారు. తీర్పును కోర్టు రిజర్వు చేసిందన్నారు. వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వాలని లింగమనేని రమేశ్‌ తరఫున న్యాయవాది అఫిడవిట్‌ దాఖలు చేశారన్నారు. జప్తు వ్యవహారంలో మూడో వ్యక్తి అభ్యర్ధన చెల్లుబాటు కాదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... న్యాయవాది అఫిడవిట్‌ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కౌంటర్‌ వేయాలని సీఐడీని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa