ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధికారిక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని మోదీతో పాటూ ఇతర భారతీయ ప్రముఖులు సహా మొత్తం 400 మంది అతిథులు హాజరయ్యారు. బిలియనీర్ ముఖశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, కార్పొరేట్ దిగ్గజం ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబీ సీఈఓలు సత్య నాదేళ్ల, సుందర్ పిచాయ్, శంతను నారాయణ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.
శ్వేతసౌధానికి దక్షిణాన ఉన్న లాన్లో ఈ విందు జరిగింది. ప్రధాని కోసం ప్రత్యేకంగా శాకాహార వంటకాలను వైట్హౌస్ సిద్ధం చేసింది. చిరు ధాన్యాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం తెచ్చేందుకు మోదీ కృషి చేస్తున్న నేపథ్యంలో వంటకాల్లో వాటినీ చేర్పించారు. విందు అనంతరం ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో, అమెరికా కాంగ్రెస్లో రెండోసారి ప్రసంగించిన మూడో విదేశీ నాయకుడిగా మోదీ నిలిచారు. మొదటిసారి 2016లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీ అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించిన విషయం తెలిసిందే.
‘అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్లో ప్రసంగించడం గొప్ప గౌరవం.. ఇలా రెండు సార్లు ప్రసంగించడం విశేషం.. ఈ గౌరవానికి భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2016లో మీలో దాదాపు సగం మంది ఇక్కడే ఉన్నారు.. పాత స్నేహితులుగా మీ ప్రేమను నేను పొందుతున్నాను.. మిగతా సగంలో కొత్త స్నేహం ఉత్సాహాన్ని కూడా చూడగలను.. నేను 2016లో ఇక్కడ కలుసుకున్న సెనేటర్లు హ్యారీ రీడ్, జాన్ మెక్కెయిన్, ఓరిన్ హాచ్, ఎలిజా కమ్మింగ్స్, ఆల్సీ హేస్టింగ్స్ ఇతరులను నేను గుర్తుంచుకున్నాను.. కానీ ఇప్పుడు వారు మాతో లేరు.’ అని మోదీ అన్నారు.
‘ఇప్పుడు యుగం కూడలిలో ఉన్న మనం.. ఈ శతాబ్దం గురించి మాట్లాడటానికి ఇక్కడ ఉన్నాను.. మన ప్రయాణించిన మలుపుల రహదారిలో స్నేహానికి పరీక్షను ఎదుర్కొన్నాం... ఏడేళ్ల కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది. కానీ చాలా వరకు అలాగే ఉన్నాయి.. గత కొన్నేళ్లుగా భారత్, అమెరికా మధ్య స్నేహాన్ని మరింత బలోపతం చేయాలనేది మా నిబద్దత.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేక పురోగతి సాధించాం’ అని మోదీ పేర్కొన్నారు.
‘నిరంతరం ప్రజలతో సంధానం కావడం.. వారి నాడి తెలుసుకోవడం ప్రజాస్వామ్యానికి అందం.. దీనికి చాలా సమయం, శక్తి, కృషి, ప్రయాణం అవసరమని నాకు తెలుసు. నేను శక్తివంతమైన ప్రజాస్వామ్య పౌరుడిగా, నేను ఒక విషయం ఒప్పుకోగలను మిస్టర్ స్పీకర్.. మీది చాలా కఠినమైన పదవి.. అభిరుచి, ఒప్పించడం, విధానపరమైన అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది..
ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య బంధాన్ని వేడుకగా జరుపుకోవడానికి అందరూ కలిసి రావడం చూసి చాలా సంతోషిస్తున్నారు... బలమైన ద్వైపాక్షిక ఏకాభిప్రాయం అవసరమైనప్పుడు సహాయం చేయడం సంతోషకరం. అంతర్గత ఆలోచనలో పోటీ ఉంటుంది.. ఉండాలి. కానీ, మన దేశం కోసం మాట్లాడేటప్పుడు ఒక్కటవ్వాలి. మీరు దీన్ని నిరూపించారు.. అందుకు అభినందనలు!’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa