రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపునకు రూ.200 కోట్ల విడుదలకు జీవో ఇచ్చామని.. త్వరలోనే ఆ సొమ్మును వారి అకౌంట్లలో జమ అవుతుందని సీఆర్డీఏ తరఫు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రాతపూర్వక వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
అమరావతి రైతులకు కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాలు చేస్తూ మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వెంటనే కౌలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. శుక్రవారం జరిగిన విచారణలో.. రైతులకు ఏటా చట్టబద్ధంగా ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించాల్సి ఉందని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి వివాదాంశం లేదని.. సకాలంలో చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. రూ.200 కోట్ల విడుదలకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని సీఆర్డీఏ తరఫు లాయర్ తెలిపారు. త్వరలో సొమ్ము జమ అవుతుందని చెప్పారు.
మరోవైపు అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు చెందినవారికి ఇళ్ల స్థలాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాజధానిలో ఇళ్లు మంజూరు చేసేందుకు అంగీకరించిన కేంద్రం.. నిర్మాణానికి అవసరమైన నిధుల్ని మాత్రం కోర్టు కేసు తేలాకే ఇస్తామని తెలిపింది. ఈ పథకం గడువు ముగిసేలోగా కోర్టు కేసులు పరిష్కారమైతేనే నిధులిస్తామని.. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించాల్సి వస్తుందని సీఎస్ఎంసీ సమావేశం మినిట్స్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో బయటి ప్రాంతాలకు చెందినవారికి స్థలాలు కేటాయించడం.. వాటిలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేయడంపై కోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు చెందినవారికి స్థలాలు కేటాయించేందుకు సీఆర్డీఏ చట్టాన్ని సవరించి, మాస్టర్ప్లాన్లో మార్పులు చేసి ఆర్5 జోన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 47,017 మందికి రాజధానిలో పట్టాలు పంపిణీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు తుది తీర్పునకు లోబడే.. ఆ స్థలాలపై పట్టాదారులకు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లోనూ ప్రస్తావించింది.. కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ అక్కడ ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. రాజధానిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.. ఆ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయాలని.. ఒక వేళ కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే కేంద్రం ఇచ్చిన నిధుల్ని తిరిగి ఇచ్చేస్తామని రాష్ట్రం తెలిపింది.. కానీ కేంద్రం అంగీకరించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa