ఐదు గ్యారెంటీల అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. మందు బాబుల జేబులకు చిల్లు పెడుతోంది. ఉచిత పథకాలు అమలు చేసేందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు ఆ భారాన్ని మద్యం ప్రియుల మీద వేస్తోంది. ఈ మేరకు ఇటీవల కర్ణాటక శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పెరిగిన మద్యం ధరలు జులై 19 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే తాజాగా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 20 శాతం పెరగడంతో దేశంలోనే మద్యం ఎక్కువ ధరకు విక్రయించే రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలోకి వచ్చింది. ఇక బీర్ల విషయానికి వస్తే.. దేశంలో అత్యధిక రేటుకు బీరును అమ్మే రాష్ట్రాల జాబితాలో కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది.
అయితే దేశీయ లిక్కర్ అయిన అరక్ అమ్మకాలను చాలా కాలంగా కర్ణాటకలో నిషేధించినందున.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్లు కర్ణాటకలో ఇప్పటికీ తక్కువ ధర ఉన్నాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చినపుడు కొన్ని తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్లు కూడా అధిక ధర ఉన్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ స్లాబ్లో ఉన్న మద్యం ( బల్క్లో లీటర్ మద్యం ధర రూ. 449 ) ధర మినహా మిగిలిన బ్రాండ్లు అన్ని కర్ణాటకలోనే అధికంగా ఉన్నట్లు కర్ణాటక బ్రేవరీస్ అండ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ పార్సా వెల్లడించారు. ఇది నిజంగా అన్ని రకాల మద్యం వినియోగదారులకు ఇబ్బంది కలిగించే అంశమని ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా.. ఎక్సైజ్ శాఖ అధికారుల వాదన మరోలా ఉంది. కర్ణాటకలో మద్యం వినియోగదారుల్లో 78 శాతం కన్నా ఎక్కువ మంది తక్కువ మరియు మధ్యస్థ స్లాబ్లలో ఉన్న మద్యాన్నే తీసుకుంటారని.. కేవలం 5 శాతం మంది మాత్రమే పెద్ద బ్రాండ్ల మద్యాన్ని సేవిస్తారని.. పేర్కొంటున్నారు. ధరల పెంపు అనేది కొంత మంది మద్యం ప్రియులపై మాత్రమే ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై కొన్ని రోజుల తర్వాత సీఎం సిద్ధరామయ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇక బీర్ల విషయానికి వస్తే దేశంలో అత్యధిక రేట్లు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కర్ణాటకలో బీరు ధర రూ. 187 ఉంది. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడులో అత్యధికంగా రూ. 210, ఢిల్లీలో రూ. 190 ఉన్నాయి. ఈ అదనపు ఎక్సైజ్ సుంకం పెంచకముందు కర్ణాటకలో బీరు ధర రూ. 175 ఉండగా.. ప్రస్తుతం అది రూ. 12 పెరిగి రూ. 187 కు చేరినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa