ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గాల వారీగా కమిటీలపై రిపోర్టులు,,,టీడీపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2023, 09:30 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి.. ఇంఛార్జ్‌ల పనితీరుపై సమీక్ష చేస్తున్నారు. అవసరమైన చోట్ల చంద్రబాబు ఇంఛార్జ్‌లను మార్చేస్తున్నారు.. పెండింగ్ ఉన్నచోట కొత్తవారిని నియమిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు వైఎస్సార్‌సీపీ గృహసారధులకు చెక్ పెట్టేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సమయం మరింత దగ్గరపడటంతో బూత్‌ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అందుకే బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.


బూత్‌ స్థాయి నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జుల వరకు.. ప్రతి నాయకుడి పనితీరుపై నెలవారీగా నివేదికలు తెప్పించుకోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెండు వేర్వేరు బృందాలతో ప్రతి నెలా విడివిడిగా సర్వేలు చేయిస్తారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 10 మంది సభ్యులతో ఒక బ్యాక్‌ ఆఫీసును ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలు బూత్‌ల వారీగా గత మూడు ఎన్నికల ఫలితాలను విశ్లేషించి.. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. బూత్‌ కమిటీలు, యూనిట్‌, క్లస్టర్‌, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు.. ఇలా నాలుగు దశల్లో అందరి పనితీరును కమిటీ సభ్యులు ప్రతి నెలా సమీక్షిస్తారు. ప్రతి నెలా 8న గ్రామ కమిటీ, 12న మండల కమిటీ, 22న జిల్లా సమన్వయ కమిటీల సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.


కొత్తగా తీసుకొస్తున్న ఈ వ్యవస్థ గురించి వారికి వివరించారు. నమూనాగా 15 నియోజకవర్గాలకు సంబంధించి రూపొందించిన నివేదికలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణకు కొన్ని సర్వే బృందాలను అధినాయకత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ బృందాలు పంపే సమాచారంతోపాటు వేరే మార్గాల ద్వారా కూడా వివరాలు తెప్పించుకుంటోంది. దాన్ని విశ్లేషించి నివేదికల తయారీకి టెక్నాలజీని వాడుతున్నారు. టీడీపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో 40 కుటుంబాలకు ఒక గృహ సాధికార సారథిని నియమించింది. బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసింది.. అయిదు బూత్‌ల్ని ఒక యూనిట్‌గా, అయిదు యూనిట్‌లను ఒక క్లస్టర్‌గా విభజించింది. నియోజకవర్గంలో సుమారు 10 కస్టర్లు ఉంటాయి.


నెలవారీ ఈ టెక్నాలజీ సాయంతో పనితీరు నివేదికలు రూపొందిస్తుంది. నియోజకవర్గ ఇంఛార్జ్, మండల పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్‌ ఇన్‌చార్జి, యూనిట్‌ ఇన్‌చార్జి, బూత్‌ కమిటీ కన్వీనర్‌ వంటి నేతల పనితీరుపై రిపోర్టులు సిద్ధమవుతాయి. ఈ నిర్ణయంతో ఎన్నికల ముందు పార్టీ కమిటీల పనితీరు మెరుగుపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా లోపం ఉంటే సరిదిద్దుకోవడానికి వీలుపడుతుంది అంటున్నారు. కొద్దిరోజుల్లో 175 నియోజకవర్గాల నివేదికలు తయారు చేయించే పనిలో ఉన్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌ పకడ్బందీగా చేసేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa