శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆస్తులను వేలానికి సిద్ధమయ్యాయి. ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీచేసింది. మెసర్స్ ఏఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి భార్య అపర్ణరెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి షూరిటీగా కంపెనీ రుణాలు తీసుకుంది. ఆ లోన్లు సకాలంలో చెల్లించకపోవడంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ప్రకటనలో తెలిపింది.
ఈ కంపెనీ పేరుతో తీసుకున్న లోన్లు ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి రూ.908 కోట్లు అయ్యింది. అందుకే కంపెనీ ఆస్తులు, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఆస్తులను కలిపి వేలం వేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 2005 డిసెంబరులో ఏఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ప్రారంభించినట్లు సమాచారం.. మొదట్లో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారట. తర్వాత శ్రీధర్రెడ్డి రాజీనామా చేయగా.. 2014లో ఆయన భార్య అపర్ణరెడ్డి డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. తమ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన పనులలు చేసిందని.. ఆ పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేదని ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అంటున్నారు.
శ్రీధర్ రెడ్డిది ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్లసింగయ్యగారి పల్లి. ఆయన తల్లి స్వగ్రామం కడప జిల్లా పులివెందులలోని బలపనూరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది కూడా ఇదే ఊరు. శ్రీధర్ రెడ్డి తొలుత కస్టమ్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఉద్యోగం మానేసి కాంట్రాక్టులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి.. 2014లో హిందూపురం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆయన ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటు ఆఫ్రికాలోని ఉగాండాలోనూ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తున్నారు. ఆయనకు ఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పేరిట కంపెనీ ఉంది. ప్రస్తుతం ఇది సాయిసుధీర్ ఇన్ఫ్రాగా మారినట్లు చెబుతున్నారు. తెలంగాణలోని బ్యాంకుల నుంచి శ్రీధర్రెడ్డి భారీగా రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. రుణాల కోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతోనే ఆస్తుల వేలానికి సిద్దమయ్యారని చెబుతున్నారు. షూరిటీగా పెట్టిన ఆస్తుల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని భూములు ఉన్నాయి. కర్ణాటకతో పాటు అనంతపురం జిల్లాలో ఇంజనీరింగ్ కంపెనీ పేరిట ఉన్న ఆస్తులు కూడా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa