రామాయణంలో రావణుడిని చంపి.. లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి వానర సేన సముద్రంలో రామసేతను నిర్మించింది. అయితే దీని మీద ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు మాత్రం సముద్రంలో ఇప్పటికీ ఉన్న నీటిమీద తేలియాడే రాళ్లు.. రామసేతుకు నిదర్శనమని విశ్వసిస్తారు. అయితే ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాల మధ్య కేవలం వాయు, నీటి మార్గాలే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గాన్ని నిర్మించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం.. భారత సర్కార్ ముందు ప్రతిపాదనలు ఉంచింది. సముద్రంలో వంతెన నిర్మించాలని తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. తన భారత పర్యటనలో ప్రతిపాదన వెల్లడించారు.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే.. రెండు రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ పర్యటనలో వివిధ అంశాలు, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే భారత్ - శ్రీలంక మధ్య పెట్రోలియం పైప్లైన్, ఇరు దేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు భూమార్గంలో వంతెన నిర్మాణానికి సంబంధించి శ్రీలంక అధ్యక్షుడు.. ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రతిపాదనలు ఉంచారు. వీటిని పరిశీలించిన ప్రధానమంత్రి.. వాటి నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. గతేడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో భారత్ అందించిన ఆపన్న హస్తం మరిచిపోలేనిదని రణిల్ విక్రమ సింఘే పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలతో రణిల్ విక్రమ సింఘే భేటీ అయ్యారు.
శ్రీలంకలో ఉన్న తమిళుల రక్షణ, గౌరవం కోసం ఆ దేశం అన్నిరకాల చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రణిల్ విక్రమసింఘేకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. భారత తమిళులు శ్రీలంకకు వెళ్లి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా వారి కోసం రూ.75 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు. పర్యాటకం, విద్యుత్తు, వాణిజ్యం, ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి సహా ఇరుదేశాల అనుసంధాన రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రణిల్ విక్రమసింఘేతో మోదీ భేటీకి సంబంధించి పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలో యూపీఐ చెల్లింపుల విధానంతో రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సంబంధాలు బలంగా ఉంటాయని తెలిపింది. ఇరుదేసాలు ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు విజన్ డాక్యుమెంట్ను ఆమోదించినట్లు పేర్కొంది. అదే సమయంలో తమిళనాడులోని నాగపట్టణం నుంచి శ్రీలంకలోని కంకేసంతురై పోర్టుల మధ్య ప్రయాణికుల కోసం ఓడ నడపాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. భారత్ అభివృద్ధి పొరుగు దేశాలకు, హిందూ మహాసముద్ర ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa