దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గత 40 రోజులుగా టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో కిలో టమాటా 150 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్యులు జడుసుకుంటున్నారు. అయితే, టమాటా ధరల పెరుగుదలపై ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ మహిళా మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. టమాటాలను తినడం మానేస్తే ధరలు వాటంతట అవే తగ్గిపోతాయని ఆమె సెలవిచ్చారు. అంతేకాదు, టమాటాకు బదులు నిమ్మకాయలను వాడుకోండని ఆమె సలహా పడేశారు. మంత్రి వ్యాఖ్యలతో అక్కడనున్న వారు అవాక్కయ్యారు.
టమాటాలు ఖరీదైనవి అయితే వాటిని ఇంట్లో పండించుకోండి లేదా తినడం మానేయండని యూపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రతిభా శుక్లా వ్యాఖ్యానించారు. ఆదివారం హర్దోయ్ జిల్లా అసహి గ్రామంలో యూపీ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న టమాటా ధరల గురించి ప్రస్తావించారు. ‘టమాటాలు ఖరీదైనవి అయితే జనం ఇంట్లోనే పండించుకోవాలి.. ఒకవేళ వాటిని తినడం మానేస్తే ధరలు అనివార్యంగా తగ్గుతాయి.. టమాటాకు బదులు నిమ్మకాయలు తినండి.. ఎవరూ టమాటాలను తినడం మానేస్తే ధరలు దిగొస్తాయి’ అని అన్నారు.
‘ఈ ద్రవ్యోల్బణానికి పరిష్కారం ఉంది.. ఇంట్లో టమాటా మొక్కలు నాటండి... అవి అన్ని వేళలా ధర ఎక్కువగా ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా నిమ్మకాయను వాడండి.. ఏది ఎక్కువ ఖరీదైతే దానిని పక్కన బెట్టండి... దీంతో అనుకోకుండా చౌకగా మారుతుంది’ అని తెలిపారు. అసహి గ్రామంలో న్యూట్రిషన్ గార్డెన్ ఉందని, అందులో గ్రామ మహిళలు టమాటాలు కూడా వేసుకోవచ్చని సూచించారు.
మరోవైపు, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే శుక్రవారం మాట్లాడుతూ.. టమాటాలు సహా 22 నిత్యావసర వస్తువుల రోజువారీ ధరల పెరుగుదలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన టమాటా ధరలను పరిశీలించి వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద టమాట కొనుగోళ్లను ప్రారంభించి రాయితీపై విక్రయిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa