ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదంతో వార్తల్లో నిలిచిన ఐఐటీ బాంబే,,,నాన్-వెజ్ తింటే వివక్ష చూపుతున్నట్టు విమర్శ

national |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 09:48 PM

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో మాంసాహారం దుమారం రేపుతోంది. నాన్-వెజ్ తినే విద్యార్థులపై హాస్టర్ క్యాంటీన్‌లో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాంసాహారం తినే విద్యార్థులు ఇక్కడ కూర్చోవద్దంటూ పలు పోస్టర్లు వెలిశాయంటే పరిస్థితి తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‌బాంబే ఐఐటీ క్యాంపస్‌ క్యాంటీన్‌లో మాంసాహారం తిన్న ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానించడంతో ఈ వివాదం మొదలైంది. గతవారం ఈ ఘటన హాస్టల్ నెంబరు 12లో జరిగినట్టు ఓ విద్యార్ధి వెల్లడించారు.


మరోవైపు, శాకాహారం తినేవారిని మాత్రమే ఇక్కడ కూర్చోడానికి అనుమతిస్తామని క్యాంటీన్ గోడలపై కొన్ని పోస్టర్లు వెలిశాయి. అంతేకాదు, మాంసాహారం తినే విద్యార్థులు ఎవరైనా అక్కడ కూర్చుంటే వారిని బలవంతంగా అక్కడ నుంచి తరలిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై మూడు నెలల కిందట సమాచార హక్కుచట్టం ద్వారా వివరణ కోరిన స్టడీ సర్కిల్.. వారి నుంచి వచ్చిన సమాధానాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసింది.


‘మాంసాహారులు, శాకాహారులు అంటూ ఐఐటీ బాంబే క్యాంపస్‌ క్యాంటీన్‌లో ఎలాంటి విభజన లేదని సమాధానం వచ్చింది.. కానీ కొందరు వ్యక్తులు మాంసాహారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు.. శాకాహారులు మాత్రమే ఇక్కడ కూర్చునేందుకు అనుమతి ఉందంటూ పోస్టర్లు వేస్తున్నారు.. ఇతరులు అక్కడ కూర్చుంటే ఖాళీ చేయిస్తున్నారు’ అని మండిపడింది.


ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ఇది అట్టడుగు వర్గాలను అవమానించడమేనని, అందుకే అలాంటి పోస్టర్లు వేశారని పలువురు విమర్శిస్తున్నారు. ఆహారపు అలవాట్లతో మెరుగ్గా భావించడం అనే ఆలోచన తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని దుయ్యబడుతున్నారు. దీనిపై ఐఐటీ డైరెక్టర్, ఇతర అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.


2018లో ఐఐటీ-బాంబే హాస్టల్ మాంసాహారం తీసుకునే విద్యార్థులను విడిగా ప్లేట్‌లు వాడాలని కోరుతూ జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమైంది. మాంసాహారం తినే వారు ప్రత్యేక ప్లేట్లను ఉపయోగించాలని చాలా మంది విద్యార్థుల నుంచి డిమాండ్లు ఉన్నాయని హాస్టల్ మెస్ కౌన్సిల్ ఈ-మెయిల్ పంపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa