ఎన్నికల్లో గెలిచి 30 నెలలు గడుస్తున్నా.. కనీసం ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇప్పించలేకపోయా.. ఇప్పటివరకు చిన్న పనీ చేయలేకపోయా.. వీధి దీపాలు లేవు. కాలువల్లో పూడిక తీయడం లేదు. చెత్త ఎత్తడం లేదు.. ఇదీ ప్రజల ఆదరణతో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఓ కౌన్సిలర్ ఆవేదన. ప్రజలకు ఏ విధంగానూ సేవ చేయలేకపోతున్నాననే బాధతో మున్సిపల్ సమావేశంలో తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. టీడీపీ కౌన్సిలర్ ఆవేదనతో సమావేశం కాస్తా రసాభాసగా మారింది. ఎన్నికల్లో గెలిచి 30 నెలలు కావస్తున్నప్పటికీ తన వార్డులో సమస్యలను పరిష్కరించలేకపోయానంటూ నర్సీపట్నం 20 వ వార్డు కౌన్సిలర్ రామరాజు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశంలో తీవ్ర ఆవేదనతో మాట్లాడిన రామరాజు.. కనీసం కొళాయి కూడా వేయించలేకపోయానంటూ బావోద్వేగానికి గురయ్యారు. తన పదవీ కాలంలో అప్రోచ్ రోడ్డు కూడా వేయించలేకపోయానంటూ.. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఆవేశానికి గురైన రామరాజు.. చెప్పుతో కొట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరోవైపు గత మూడు సంవత్సరాలుగా ప్రతి సమావేశంలో తన వార్డు సమస్యలు లేవనెత్తుతున్నప్పటికీ.. ఏ ఒక్క సమస్యపైనా మున్సిపాలిటీ అధికారులు దృష్టి పెట్టడం లేదని రామరాజు వాపోతున్నారు. ప్రజలు నమ్మి తనను వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నుకున్నారని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన ఎలా వ్యక్తం చేయాలో తెలియక.. తన చెప్పు తీసుకొని తానే కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు .
తన వార్డు పరిధిలోని లింగాపురంలో ఏ పనులూ చేపట్టలేకపోతున్నానని.. ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి చచ్చిపోదామనిపిస్తోందని భావోద్వేగానికి గురయ్యారు. రోడ్డేయిస్తానని రెండేళ్ల కిందట ఎమ్మెల్యే గణేష్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఆ తర్వాత టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఛైర్పర్సన్ సుబ్బలక్ష్మి జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa