ప్రేమికుల మధ్య గొడవలు, అలకలు, బుంగిమూతి పెట్టడాలు.. మాట్లాడుకోకపోవడాలు.. బతిమాలించుకోవడాలు వంటివి సర్వసాధారణం. కానీ, ఓ బాలిక మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ప్రియుడిపై అలిగి ఆమె ఏకంగా హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కింది. దీంతో ఆమెను బుజ్జగించడానికి ప్రియుడు కూడా దానిపైకి ఎక్కాల్సి వచ్చింది. 80 అడుగుల ఎత్తైన విద్యుత్ టవర్ ఎక్కేయడంతో వారి ఇద్దర్నీ కిందకు దిగి రావాలని స్థానికులు నచ్చజెప్పారు. చివరకు పోలీసులు వస్తే గానీ ఇద్దరూ దిగిరాలేదు. విస్తుగొలిపే ఈ ఘటన ఛత్తీస్గఢ్ లోని మార్వాహి జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. మార్వాహి జిల్లా గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన ఓ బాలిక.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో రోజుల కిందట ప్రేమికుల మధ్య ఫోన్లోనే వాగ్వాదం జరిగింది. ప్రియుడితో గొడవపడిన బాలిక.. ఆ కోపంలో తన గ్రామ సమీపంలో 80 అడుగుల ఎత్తున్న హైటెన్షన్ విద్యుత్ టవర్పైకి ఎక్కింది. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ప్రియుడు.. ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు.
ఆమె దిగకపోవడంతో తాను కూడా ఆ టవర్ పైకి ఎక్కాల్సి వచ్చింది. దీంతో అక్కడ స్థానికులంతా గుమిగూడి వారిని కిందకి దిగమని నచ్చజెప్పారు. తమ పిల్లలు టవర్ ఎక్కిన విషయం తెలిసి ప్రేమికుల కుటుంబాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. అయినా ప్రేమికులు దిగిరాకపోవడంతో విషయం పోలీసులకు చేరింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. వారికి చెప్పి చూశారు. కొద్దిసేపు బెట్టుచేసిన ఇద్దరూ.. మెల్లగా టవర్ దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సురక్షితంగా కిందకు దిగిన ఆ జంటకు.. మళ్లీ ఇలాంటి పనులకు పాల్పడవద్దని పోలీసులు మందలించి వదిలేశారు. ఎటువంటి కేసు నమోదుచేయలేదని పోలీసులు తెలిపారు. వారికి అయితే, ఈ తతంగాన్ని స్థానికులు వీడియో తీసి.. ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa