ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయుధాలతో ఆలయంలోకి చొరబడిన ముష్కరులు,,,ధైర్యం చేసి ముందుకొచ్చి ఎదిరించిన భక్తుడు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 09:32 PM

గొడవ జరిగినప్పుడు ఎదుటివారి చేతుల్లో కత్తో, కర్రో ఉంటేనే వాళ్ల దగ్గరకు వెళ్లడానికి భయపడిపోతాం. ఇక, చేతిలో గన్ ఉంటే ఊహించుకోగలమా? ఒళ్లంతా చెమటలు పట్టి.. లాగులు కూడా తడిసిపోతాయి. కానీ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ‘ఉగ్రవాది’కి ఎదురెళ్లిన ఓ సామాన్యుడి తెగువ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి విస్తుపోతున్నారు. మహారాష్ట్ర లోని ధూలే ప్రాంతంలోని రద్దీగా ఉండే స్వామినారాయణ్ ఆలయ ప్రాంగణంలోకి కొందరు దుండగులు ముఖాలకు మాస్క్‌లు వేసుకుని, ఆయుధాలతో చొరబడ్డారు. అనంతరం ఓ భక్తుడి తలపై తుపాకిని గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడ భక్తులు భయాందోళనకు గురయ్యారు.


ఈ పరిస్థితలో ఓ వ్యక్తి ధైర్యాన్ని ప్రదర్శించాడు. తుపాకితో బెదిరిస్తోన్న దుండగుడిపైకి దూసుకెళ్లి.. మీకసలు బుద్ధుందా..? అంటూ వారి మీద కేకలు వేయడమే కాకుండా.. చెంపలు వాయించాడు. అయితే.. అప్పటికే శ్రీ స్వామి నారాయణ్ ఆలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ, తర్వాత అసలు విషయం తెలిసిన భక్తులు, స్థానికులు విస్తుపోయారు.


తుపాకీ శబ్దాలకు వణికిపోయివారు వాళ్లు ఉగ్రవాదుల కాదని, ఇదంతా పోలీసుల మాక్‌ డ్రిల్‌లో భాగమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదులపైకి దూసుకెళ్లిన ఆ వ్యక్తి పేరు ప్రశాంత్‌ కులకర్ణి అని వెల్లడించారు. తన కుమార్తె భయపడి ఏడవటం వల్లే ఆయన అంత ధైర్యం చేసినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు చేపట్టిన ఇలాంటి డ్రిల్స్‌ పౌరులను భయాందోళనకు గురిచేస్తున్నాయని పలువురు మండిపడుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖానికి ముసుగులు వేసుకుని, ఆయుధాలతో వచ్చినవారిని చూసి పిల్లలు ఏడుపు ముఖం పెట్టడం వీడియోలో కనిపిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa