అంత్యక్రియల వేళ శ్మశానంలో చిచ్చు రేగింది. రెండు గ్రామాల మధ్య వివాదం జరిగింది. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించబోనివ్వం అంటూ ఒక గ్రామం వారు మరొక గ్రామం వారిని అడ్డుకున్నారు. బంధువు మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకొచ్చిన మరో గ్రామానికి చెందిన వారిని ఈ పరిణామం మరింత ఆవేదనకు గురిచేసింది. అల్లూరి జిల్లా పాడేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక కోసం మినుములూరు, ముంతమామిడి గ్రామాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ముంతమామిడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం (ఆగస్టు 10) మృతి చెందారు. అంత్యక్రియలు జరిపించేందుకు ఆ వృద్ధుడి బంధువులు, కుటుంబసభ్యులు మృతదేహాన్ని మినుములూరు పరిధిలో అంతిమ క్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకొచ్చారు. అది గమనించిన మినుములూరు గ్రామస్థులు వారిని రానివ్వకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముంతమామిడి గ్రామస్థులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
సమాచారం అందుకున్న పాడేరు ఎస్సై లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు గ్రామాలకు చెందిన వారి వాదనలు విన్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని.. వందేళ్ల నుంచి ఎవరూ అడ్డుచెప్పలేదని ముంతమామిడి గ్రామపెద్దలు చెబుతున్నారు. అది తమ పట్టా భూమి అని, తమ భూమిలో అంత్యక్రియలు చేయనివ్వబోమని మినుములూరు గ్రామానికి చెందిన వ్యక్తి చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఎస్సై లక్ష్మణ్.. ఈసారికి అంత్యక్రియలు నిర్వహించుకోనివ్వాలని సర్ది చెప్పారు. రెవెన్యూ కార్యాలయంలో ఫటిషన్ ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ముంతమామిడి గ్రామస్థులకు సూచించారు. ఆ తర్వాత వృద్ధుడి మృతదేహానికి ఖననం చేసేంతవరకూ అక్కడే ఉండి, ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితి మరొక్కసారి తలెత్తకుండా అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని ముంతమామిడి గ్రామస్థులు కోరుతున్నారు. శ్మశానవాటిక తమకే ఉండేటట్టు చూడాలని వేడుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa