తిరుమలలో చిరుత దాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాలిక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నారు. టీటీడీ తరపున రూ.5 లక్షలు అందించనుండగా.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూ.5 లక్షలు ఇవ్వనుంది. మొత్తం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను చిన్నారి కుటుంబానికి ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది.
లక్షిత ఘటనపై స్పందించేందుకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మీడియా సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరుత దాడిలో బాలిక మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక లక్షిత తల్లిదండ్రులతో కాకుండా నడకదారిలో పలుమార్లు ఒంటరిగా వెళ్లినట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. నడకదారిలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని,500 సీసీ కెమరాలను త్వరలో ఏర్పాటు చేసి వన్యమృగాలు మూమెంట్స్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. దాడి ఘటనకు సంబంధించి అటవీశాఖ అధికారులతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పారు.
దాడి చేసింది చిరుతా..? ఎలుగుబంటా..? మరేదైనా వన్యమృగమా..? అనేది స్పష్టత రాలేదని ధర్మారెడ్డి చెప్పారు. గాలి గోపురం నుండి నరసింహస్వామి గుడి వరకు భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని, ప్రతీ పది మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును నియమిస్తామని తెలిపారు. చిన్నపిల్లలతో నడకదారిలో వచ్చే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, మీ సంరక్షణలో పెట్టుకోవాలని సూచించారు, హై అలర్ట్ జోన్లో బోన్లు ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు అలిపిరి నడకదారిలో భక్తులను అనుమతిస్తున్నామన్నారు. వన్యమృగాల సంచారం దృష్డ్యా అనుమతించే సమయాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు ధర్మారెడ్డి పేర్కొన్నారు.
అటు ఈ ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిన్నారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు.. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొద్దిరోజుల క్రితమే బాలుడు గాయపడ్డాడని, టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఇప్పటి ఘోరం తప్పేదని వ్యాఖ్యానించారు. అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టి భక్తుల భయాన్ని తొలగించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa