గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచార దోషులకు శిక్ష పూర్తికాకుండానే గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఎంపిక చేసిన కొంత మంది ఖైదీలకే శిక్ష నుంచి ఉపశమనాన్ని కల్పించడం సరికాదని గుజరాత్ ప్రభుత్వం తీరును తూర్పారబట్టింది.
గుజరాత్ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. అత్యంత కిరాతక నేరగాళ్లకూ సంస్కరించుకునే అవకాశమివ్వాలని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బి.వి.నాగరత్న జోక్యం చేసుకుంటూ.. ఎంపిక చేసిన కొందరికే ఉపశమన ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పడం కష్టమని ఎఎస్జీ సమాధానం ఇచ్చారు. ప్రతి ఖైదీకీ సంస్కరించుకొనే అవకాశమివ్వాలని, కొంతమందికే ఉపశమనమివ్వడం సరికాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.
‘మరణ శిక్ష పడిన ఎందరికి యావజ్జీవ శిక్షగా మారుస్తున్నారు... 14 ఏళ్ల జైలుశిక్ష అనుభవించిన వారిలో ఎందరికి ఉపశమన విధానంతో విడుదలు చేస్తున్నారు.. ఎందుకు మిగతా ఖైదీలకు ఉపశమనం కలిగించడం లేదు? ఈ కేసులో పాలసీ ప్రయోజనాన్ని ఈ నేరస్థులకు ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వాలనే సమాధానం చెప్పాలని ఏఎస్జీకి సూచించారు. విచారణ సందర్భంగా దారుణమైన నేరానికి పాల్పడిన 11 మంది నిందితులకు ఉపశమనమిచ్చే సమయంలో ఏ మాత్రం బుర్రను ఉపయోగించలేదన్న సీబీఐ అభిప్రాయాన్ని ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను ఈ నెల 24కు ధర్మాసనం వాయిదా వేసింది.
‘కరుడుగట్టిన నేరస్తులను 14 ఏళ్ల తర్వాత విడుదల చేయడం ద్వారా వారిని సంస్కరించే అవకాశం కల్పించాలి.. ఇతర ఖైదీలకు ఎంత వరకు వర్తింపజేస్తున్నారు? పాలసీని ఎంపిక చేసి ఎందుకు వర్తింపజేస్తున్నారు? సంఘటితం చేయడానికి అందరికీ అవకాశం ఇవ్వాలి?.. ఇది ఎంత వరకు అమలవుతోంది? మన జైళ్లు ఎందుకు నిండిపోతున్నాయి’ అని నిలదీసింది. బిల్కిస్ దోషుల విడుదల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గోద్రా కోర్టులో విచారణ జరగనందున అభిప్రాయాన్ని ఎందుకు కోరారని? కూడా ప్రశ్నించింది. బిల్కిస్ బానో కేసులో దోషులకు బాంబే హైకోర్టు విధించిన శిక్షను గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేసింది. దోషులుగా నిర్ధారించిన వ్యక్తులను ఎందుకు విడుదల చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2002లో సబర్మతి ఎక్స్ప్రెస్లో 59 మంది కరసేవకుల సజీవదహనం తర్వాత గుజరాత్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని, మత ఘర్షణలకు దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa