ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మరో గొడవ చోటుచేసుకుంటోంది. జేసీ నివాసం ఎదురుగా జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం ఇప్పుడు తాడిపత్రిలో వివాదానికి దారితీసింది. జూనియర్ కాళాశాల ప్రహరీ గోడ నిర్మాణానికి కాంట్రాక్టర్ గోతులు తవ్వి పిల్లర్లు వేశాడు. అయితే పిల్లర్లను తవ్విన గోతులను రాత్రికి రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూడ్చివేయడం వివాదంగా మారింది.
అయితే కళాశాల ప్రహరీ గోడ పిల్లర్ల గుంతలను జేసీ అనుచరులే పూడ్చి వేశారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం ఆరోపిస్తుంది. దీంతో రెండు వర్గాలు భారీగా కళాశాల దగ్గరకు చేరుకుంటుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండడంతో సంఘటనా స్దలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉందని, ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేయడానికి అనుమతి లేదని పోలీసులు సూచిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అయితే 60 అడుగుల రోడ్డును వదిలి ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
కాగా తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఏదోక వివాదం రాజుకుంటుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. గతంలో పలుమార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa