అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాడేరు ఘాట్రోడ్డులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోండగా.. 30 మందికి గాయాలయ్యాయి. మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా పాడేరు ఘాట్రోడ్డు వ్యూపాయింట్ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. చెట్టు కొమ్మను తప్పించబోయి బస్సు లోయలో పడిపోయినట్లు చెబుతున్నారు. మోదమాంబ పాదాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు. అంబులెన్స్లలో మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
తీవ్రంగా గాయపడినవారిలో పలువురు పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. లోయలోని చెట్ల కొమ్మలు అడ్డుపడటంతో బస్సు మధ్యలోనే చిక్కుకుందని, లేకపోతే పెను ప్రమాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా బస్సు లోయలో పడి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయడం లేదు. రెస్క్యూ సిబ్బంది సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa