ఏపీ ఎన్జీవో సంఘం పేరు మారింది. ప్రస్తుతం ఉన్న ఏపీ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం పేరును ఏపీ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీఎన్జీజీఓ అసోసియేషన్)గా మారుస్తూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలుముగిశాయి. చివరి రోజు (మంగళవారం) పలు తీర్మానాలు చేశారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి గెజిటెడ్ హోదాకు మారుతుండడంతో సభ్యత్వాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాలకు కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నారు.
సభ్యుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్రంలో 5, జిల్లా, తాలూకాల్లో 2 పోస్టులు పెంచుతున్నట్లు అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే సంఘంలోని కార్యవర్గాల్లో ఉపాధ్యక్షులు, కార్యదర్శుల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ప్రతి కార్యవర్గంలోనూ ఉద్యోగిని తప్పనిసరిగా ఉండాలని నిబంధన అమలు చేయనున్నారు. జిల్లా కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లోనే ఉండాలని.. పశ్చిమ కృష్ణా బ్రాంచ్ని విజయవాడ, తూర్పు కృష్ణా బ్రాంచ్ను మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని కూడా సమావేశాల్లో తీర్మానం చేశారు.
రాష్ట్ర రాజధానిలో, లేని పక్షంలో అసోసియేషన్ నిర్ణయించిన ప్రాంతంలో రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైన స్థలం కొనుగోలు చేసి, రాష్ట్ర కార్యాలయం నిర్మించాలని భావిస్తున్నారు. 12వ పీఆర్సీకి సంబంధించి ఐఆర్ (మధ్యంతర భృతి) డిసెంబరులోపు ఇవ్వకపోతే ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వాలని కూడా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీపీఎస్ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తున్నందున ఉద్యోగ వాటా వసూళ్లను నిలిపివేయాలని ఎన్జీవో సంఘం తరఫున డిమాండ్ చేయాలన్నారు. సంఘం ఆదాయ, వ్యయాలకు సంబంధించి జూన్ నెల వరకు ఉండే నివేదికను ఆమోదించారు.
విభజన తర్వాత హైదరాబాద్లోని ఏపీఎన్జీవోకు వచ్చిన భవనాన్ని విక్రయించిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa