చంద్రయాన్ 3 ప్రయోగం తెచ్చిపెట్టిన విజయం ప్రస్తుతం భారత దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రయోగం సక్సెస్ వెనక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలపనున్నారు. మరోవైపు.. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలను కలిసిన కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కర్ణాటక ప్రభుత్వం తరఫున ఇస్రో సైంటిస్ట్లకు ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇస్రో చేపట్టబోయే భవిష్యత్ ప్రయోగాలకు కర్ణాటక ప్రభుత్వం తరఫున అన్ని రకాలస సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
చంద్రయాన్ 3 ఘన విజయంలో కీలకపాత్ర పోషించిన 500 మంది ఇస్రో శాస్త్రవేత్తలను ఘనంగా సన్మానిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ప్రకటించారు. గురువారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సిద్ధరామయ్య.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ప్రాజెక్టు డైరెక్టర్లు వీరముత్తువేల్, కె.కల్పన, యూఆర్ఎస్సీ డైరెక్టర్ ఎం.శంకరన్లను కలిసి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ సందర్భంగానే చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాల్గొన్న 500 మంది శాస్త్రవేత్తలను కర్ణాటక ప్రభుత్వం సన్మానిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించి తేదీ, వివరాలను సెప్టెంబరు 2 వ తేదీన చెబుతామని పేర్కొన్నారు.
మరోవైపు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం రాత్రే ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా కాలు పెట్టిన కొద్ది సేపటికే డీకే శివకుమార్.. ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికప్పుడు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్నాథ్ అపాయింట్మెంట్ తీసుకుని.. బుధవారం రాత్రి 7.30 గంటలకు వారిని కలిసి సన్మానించారు. ఇస్రో ఛైర్మన్ సోమ్నాథ్, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పీ వీరముత్తువేల్, ప్రాజెక్ట్ అసోసియేట్ డైరెక్టర్ కే కల్పన, మిషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎం శ్రీకాంత్, ఇతర సైంటిస్టులకు కన్నడ సాంప్రదాయంలో సన్మానం చేశారు. కన్నడ తలపాగాను ధరింపజేసి, చందనంతో చేసిన మాలను వారి మెడలో వేసి శాలువాలు కప్పారు. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందనలు తెలపనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa