ఇటీవల అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ కుమారస్వామి.. ఆదివారం డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. హార్ట్ స్ట్రోక్, పక్షవాతానికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నా ముందుగానే పసిగట్టాలని సూచించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని హితవు పలికారు. తాను సరైన సమయంలో స్పందించి.. తన అస్వస్థతకు సంబంధించిన కారణాన్ని గుర్తించానని.. అందుకే ఇవాళ ఆరోగ్యంగా మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని కుమార స్వామి వెల్లడించారు.
తీవ్ర అస్వస్థత బారిన పడిన కుమారస్వామిని సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్లే పెద్ద ముప్పు తప్పిందని ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే ఆదివారం డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లిన కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటికి రావడం అనేది తనకు మూడో జన్మ అని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ దేవుడు, తనకు చికిత్స అందించిన డాక్టర్ల బృందమేనని తెలిపారు. ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్లు సకాలంలో తనకు చికిత్స అందించడం వల్లే కర్ణాటక రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరో కొత్త జీవితాన్ని పొందినట్లు వెల్లడించారు. హర్ట్ స్ట్రోక్, పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోవాలని ప్రజలకు కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.
తాను ఈ రోజు ప్రజలతో మాట్లాడుతున్నానంటే.. తనకు పునర్జన్మ వచ్చినట్లేనని చెప్పారు. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక జన్మ మాత్రమే ఉంటే.. తనకు మాత్రం ఇది మూడో జన్మ అని పేర్కొన్నారు. తనకు 64 ఏళ్ల వయసులో దేవుడు మూడో జన్మను ప్రసాదించినట్లు భావిస్తున్నానని కుమారస్వామి చెప్పారు. ఈ సందర్భంగా తనకు అస్వస్థతకు గురైన నాడు జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 30 వ తేదీ రోజు అర్ధరాత్రి 2 గంటలకు తనకు మెలకువ వచ్చిందని.. ఆ సమయంలోనే అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. పక్షవాతం లక్షణాలు కావచ్చని తనకు అనుమానం వచ్చిందని.. ఎలాంటి ఆలస్యం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించి.. వారు ఇచ్చిన సలహాలతో ఆస్పత్రిలో చేరినట్లు గుర్తు చేసుకున్నారు.
హార్ట్ స్ట్రోక్కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దని.. అవే ప్రాణాలను నిలబెట్టే అమృత క్షణాలు అని ప్రజలకు కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. తనకు అస్వస్థతకు గురైన రోజు ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. జీవితాంతం మంచానికే పరిమితమయ్యేవాడినని తెలిపారు. ఇదిలా ఉండగా.. కుమారస్వామి ఆగస్టు 30 వ తేదీన తెల్లవారుజామున బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు స్ట్రోక్ వచ్చిందని.. ఆ తర్వాత పూర్తిగా నయమైందని కుమారస్వామికి చికిత్స అందించిన డాక్టర్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa