ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతితో కలిసి లండన్కు బయల్దేరి వెళ్లారు. శనివారం రాత్రి 9.30 గంటలకు విజయవాడ నుంచి జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో లండన్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్తోపాటు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తదితరులు వీడ్కోలు పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం జగన్ లండన్ వెళ్లారు. అక్కడ ఉంటున్న తమ పిల్లలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలతో సీఎం దంపతులు గడపనున్నారు. సీఎం జగన్ సెప్టెంబర్ 11న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
లండన్ వెళ్లడం కోసం జగన్ ఇంతకు ముందే సీబీఐ కోర్టులో అనుమతి పొందారు. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీసీఐ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సైతం సీబీఐ కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. జగన్ పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డికి మంచి అకాడమిక్ రికార్డ్ ఉంది. 2017లో ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చేరింది. ఎకనమిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. అమెరికాలోని ఓ ఫైనాన్షియల్ కన్సల్టెంట్లో ఉద్యోగానికి ఎంపికైంది. కానీ ప్రపంచంలో టాప్-5 బిజినెస్ స్కూల్స్లో ఒకటిగా పేరొందిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆమె ఫైనాన్స్లో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. డిస్టింక్షన్లో పాసైన హర్షా రెడ్డి డీన్ లిస్ట్లో చోటు దక్కించుకుంది.
హర్షా రెడ్డి గ్రాడ్యుయేషన్ సందర్భంగా.. గత ఏడాది జులై 2న జగన్ దంపతులు పారిస్ వెళ్లారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా జగన్ ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి లండన్లోని కింగ్స్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అంతకు ముందు ఆమె అమెరికాలో చదువుకుంది. జగన్ కుమార్తెలిద్దరూ ఇప్పటి వరకూ తమ జీవితాన్ని ప్రయివేట్గా గడిపేందుకే ఇష్టపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa