కర్నూలు జిల్లా వాసులకు గుడ్ న్యూస్. పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో రూ.200 కోట్లతో బంగారం శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కానుంది. దేశంలోకెల్లా తొలిసారి ప్రయివేట్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ బంగారం తవ్వకాలు జరగనున్నాయి. రోజుకు 1500 టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే సామర్థ్యంతో జొన్నగిరిలో శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. మన దేశంలో 1880లో కోలార్ గోల్డ్ మైన్ ప్రారంభం కాగా.. 1945లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో రాయచూర్లో హట్టి మైన్స్ ప్రారంభమైంది. మళ్లీ ఇప్పటి వరకూ మన దేశంలో బంగారం తవ్వకాలు చేపట్టలేదు. స్వాతంత్య్రం వచ్చాక మన దేశంలో బంగారం తవ్వకాలు చేపడుతున్న తొలి సంస్థగా జియో మైసూర్ గుర్తింపు పొందింది.
బొల్లవానిపాలెం గ్రామ సమీపంలో జియో మోసూర్ సంస్థ కర్మాగారం ఏర్పాటు అవుతుండగా.. ఇందుకోసం 30 ఎకరాల భూమిని కేటాయించారు. సంస్థ ప్రతినిధులు శనివారం కర్మాగారం ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఏడాదిలోగా ఈ కర్మాగారాన్ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇప్పటికే 100 మందికి ఉపాధి కల్పిస్తోన్న ఈ సంస్థ.. ప్లాంట్ ప్రారంభమయ్యాక మరో 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. అనంతపురం జిల్లా రామగిరిలోనూ బంగారు నిక్షేపాలను గుర్తించారు. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాత.. 2005లోనే జియో మోసూర్ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది.
2013లో ఈ సంస్థకు బంగారం వెలికితీతకు అనుమతులొచ్చాయి. బంగారు నిక్షేపాలు ఉన్న 350 ఎకరాలను కొనుగోలు చేసిన ఆ సంస్థ.. మరో 1500 ఎకరాలను లీజ్కు తీసుకుంది. భూమిని లీజ్కు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తోంది. బంగారం తవ్వకాల కోసం ఈ సంస్థ ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున 30 వేల మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో.. పూర్తి స్థాయిలో ఈ సంస్థ మైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa