దేశ వ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికల నిర్వహణ, అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యుల కమిటీని కూడా నియమించింది. తాజాగా ఆ కమిటీలోని సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ కమిటీకి సంబంధించి.. హస్తం పార్టీ పలు అనుమానాలను వ్యక్తం చేసింది. జమిలీ ఎన్నికలు నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. జమిలీ ఎన్నికల ఆలోచన అనేది భారత దేశ ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ముఖ్యంగా రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడంలో చూపించిన వేగం.. ఆ కమిటీకి ఇచ్చిన సూచనలు చూస్తుంటే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆ కమిటీలో ఉండేందుకు తమ పార్టీ నేత నిరాకరించినట్లు స్పష్టం చేసింది.
జమిలీ ఎన్నికలపై తాజాగా మాట్లాటిన రాహుల్ గాంధీ.. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనేవి భారతదేశ ఐక్యతపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. దీంతో పాటు అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచన అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. భారత్ అంటే రాష్ట్రాల సమైఖ్యత అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపైనా రాహుల్ గాంధీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియ మాత్రమేనని తెలిపారు. ఎందుకంటే ఆ కమిటీ ఏర్పాటు చేసిన సమయం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. వీటికి తోడు ఆ కమిటీకి సూచించిన నియమ నిబంధనలను చూస్తే కమిటీ ఇవ్వాల్సిన సిఫార్సులను కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఆ జమిలి ఎన్నికల కమిటీలో ఉండేందుకు కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి నిరాకరించడం సరైందేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
మరోవైపు.. ఒకే దేశం ఒకే ఎన్నికపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన 8 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి సహా మొత్తం 8 మంది ఉన్నారు. ఈ కమిటీ వెంటనే పని ప్రారంభించాలని.. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సూచించింది. అయితే సిఫార్సులు చేసేందుకు స్పష్టమైన గడువును మాత్రం సూచించలేదు. అయితే కమిటీ సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విధివిధానాలను ఆ కమిటీయే రూపొందించుకోవచ్చని.. ఇది ప్రజల సూచనలను కూడా వింటుందని తాజా విడుదల చేసిన గెజిట్లో కేంద్రం పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి, అవసరమైనవాటిని తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa