మన బిడ్డ మరో దేశానికి కోడలిగా వెళ్లి.. ఆ దేశాధ్యక్షుడి భార్యగా.. భర్తతో కలిసి సొంత గడ్డ మీద అడుగుపెడితే..? ఆ అమ్మాయికి, ఆమె కుటుంబానికి ఎంతో ఆనందం కలుగుతుంది కదూ..! యూకే ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షితా మూర్తి.. ఆమె తల్లిదండ్రులు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తి ఇప్పుడు ఇదే రకమైన ఆనందాన్ని పొందుతున్నారని అనుకోవచ్చు. భారత మూలాలు ఉన్న రిషి సునక్ గతేడాది యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. రిషి యూకే ప్రధానిగా ఎన్నికైనప్పుడు నారాయణమూర్తి ఎంతో సంతోషించారు. రిషి సునక్ విషయానికి వస్తే.. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్నవారే. ఈస్ట్ ఆఫ్రికా మీదుగా వారు యూకే వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడే రిషి పుట్టి పెరిగారు. అమెరికాలోని స్టాన్ఫోర్ యూనివర్సిటీలో చదువుకున్న అక్షతా మూర్తి అక్కడే రిషితో ప్రేమలో పడ్డారు. 2009లో బెంగళూరులో భారతీయ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. అక్షతను పెళ్లాడిన ఏడాదికే కన్జర్వేటివ్ పార్టీలో చేరిన రిషి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ 2022లో యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ఇప్పుడు జీ20 సదస్సు కోసం.. యూకే ప్రధాని హోదాలో రిషి సునక్ తొలిసారి తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీలో అడుగుపెట్టారు. అందరికీ అభివాదం చేస్తూ విమానం దిగుతున్న ఈ జంటను చూసి.. నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతులు ఎంతో సంతోషించి ఉంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ‘మా అమ్మాయికి ఫారిన్ సంబంధం ఉంది.. మా వాడు అమెరికాలో సెటిలయ్యాడు.. గ్రీన్ కార్డు వచ్చింది.. అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు’ అని మన దగ్గర మురిసిపోయేవాళ్లు ఎంతో మంది. అలాంటిది ఒకప్పుడు మనదేశాన్ని పాలించిన దేశానికి ప్రధానమంత్రిగా, ఆయన భార్య హోదాలో అల్లుడూ కూతురు మన గడ్డ మీద అడుగుపెడుతుంటే మూర్తి దంపతులే కాదు.. సాటి భారతీయులుగా మనందరికీ ఆనందం కలగక మానదు.
ఇక రిషి విషయానికి వస్తే.. భారత గడ్డ మీద అడుగుపెట్టిన భారతమూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధాని రిషినే కావడం విశేషం. తాను హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తారాయన. భారత మూలాలు తనకు గర్వకారణం అని జీ20 సదస్సుకు వచ్చే ముందు ఆయన స్పష్టం చేశారు. భారత్కు వచ్చే ముందు ఆయన మాట్లాడుతూ.. తాను ప్రధాని అయ్యాక.. డౌనింగ్ టౌన్లో దీపావళి రిసెప్షన్ నిర్వహించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అక్షతతో కలిసి భారత్ రావడం గొప్ప అనుభవం అన్న రిషి.. చిన్నతనంలో తాము తిరిగిన ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa