ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీసీటీవీల్లో రికార్డైన నిజ్జర్ హత్య ఘటన,,,,సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా పత్రిక

international |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 10:10 PM

కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయం ప్రస్తుతం భారత్, కెనడాలతోపాటు ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిజ్జర్‌ను దుండగులు హత్య చేసిన సమయంలో అక్కడే ఉన్న సీసీటీవీల్లో హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయినట్లు తాజాగా అమెరికాకు చెందిన పత్రిక వాషింగ్టన్ పోస్ట్.. వెల్లడించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ హత్యకు సంబంధించిన వీడియోను తాము చూసినట్లు కూడా చెప్పడం ప్రస్తుతం కీలకంగా మారింది. 90 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో దుండగులు.. నిజ్జర్‌ను హత్య చేసి వెళ్లినట్లు వాషింగ్టన్ పోస్టు తెలిపింది.


ఆ వీడియోలో ఉన్న విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది. రాత్రి 8.27 గంటలకు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యకు గురైనట్లు వెల్లడించింది. నిజ్జర్ ఉపయోగించేగ్రే కలర్‌ పికప్‌ ట్రక్‌.. దాని పక్కనే ఒక వైట్ కలర్ సెడాన్‌ కారు ప్రయాణించిందని.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత సెడాన్‌ కారు వేగంగా పికప్‌ ట్రక్‌ ముందుకు వచ్చి ఆపేసిందని పేర్కొంది. వెంటనే సెడాన్ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు స్వెట్‌ షర్ట్‌లు వేసుకుని.. దిగారని.. ఆ తర్వాత ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఇద్దరు దుండగులు నిజ్జర్ ఉన్న పికప్‌ ట్రక్‌ వద్దకు వచ్చి.. అందులో డ్రైవర్ సీటులో ఉన్న నిజ్జర్‌పై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌‌లో కాల్పులు జరిపినట్లు చెప్పింది. మొత్తం ఇద్దరు దుండగులు 50 బుల్లెట్లు పేల్చగా.. అందులో 34 తూటాలు నిజ్జర్‌ శరీరంలోకి చొచ్చుకెళ్లినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించింది.


ఈ ఘటన తర్వాత పక్కనే ఫుట్‌బాల్‌ మైదానంలో ఉన్న భూపిందర్‌జీత్‌ సింగ్‌ అనే వ్యక్తి నిజ్జర్ ఉన్న కారు వద్దకు వచ్చి చూసినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అయితే అప్పటికే నిజ్జర్‌ కారులో బుల్లెట్ గాయాలు, రక్తంతో తడిసి ఉన్నాడని.. దీంతో వెంటనే భూపిందర్‌జీత్ సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కెనడా రాయల్‌ మౌంటెడ్‌ పోలీస్, సర్రే హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్ మధ్య వాదనలు కూడా జరిగినట్లు పేర్కొంది. నిజ్జర్‌ హత్య నేపథ్యంలో భారత్‌, కెనడా దేశాల మధ్య దౌత్య పరంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో వాషింగ్టన్‌ పోస్టు తాజాగా ఈ విషయాలు వెల్లడించడం సంచలనంగా మారింది. అత్యవసరమైతే తప్ప భారత్‌కు వెళ్లొద్దని కెనడా పౌరులకు ఆ దేశ ప్రభుత్వం సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో పర్యటిస్తున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa