ప్రపంచంపై కరోనా మహమ్మారి విసిరిన పంజాను ఇప్పటికే ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ చాలా మందిలో పోస్ట్ కొవిడ్ సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు.. కరోనా వైరస్ అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని.. ఆ తర్వాత మరిన్ని వైరస్లు మానవాళిని తీవ్రంగా భయపెట్టనున్నాయనే వార్తలు మరింత బయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే మరో కొత్త మహమ్మారి పుట్టుకురానుందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలతో మరోసారి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. తాజాగా డైలీ మెయిల్లో ప్రచురితం అయిన ఒక కథనాన్ని చూస్తే ఆ మహమ్మారి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం అవుతోంది. ఈ కొత్త వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని వైద్య రంగ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భవిష్యత్లో మానవాళిపై విరుచుకుపడే ఆ మహమ్మారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్ఓ కొత్త పేరు పెట్టింది. దానికి ‘డిసీజ్ ఎక్స్’ అని నామకరణం చేసింది. ఈ డిసీజ్ ఎక్స్.. ఇప్పటికే తన ఉనికిని చాటుకుంటోందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. 2019 లో వెలుగు చూసిన కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో దాదాపు 70 లక్షల మంది చనిపోయారని డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ డిసీజ్ ఎక్స్ కొవిడ్ వైరస్ కంటే 7 రెట్లు అధికంగా ప్రాణాంతక మైందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బింగ్హామ్ హెచ్చరించారు. డిసీజ్ ఎక్స్ తో పోల్చితే కొవిడ్ మరీ అంత ప్రాణాంతకం కాదని తెలిపారు. డిసీజ్ ఎక్స్ కారణంగా 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ డిసీజ్ ఎక్స్ మహమ్మారి ఇప్పటికే ఉన్న వైరస్ నుంచి ఉద్భవించి ఉండొచ్చని డేమ్ కేట్ బింగ్హామ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న అనేక వైరస్లలో ఒకదాని నుంచి పుట్టుకొచ్చే వైరస్ల కారణంగా భారీగా ప్రాణ నష్టం ఉండొచ్చని తెలిపారు. ఇప్పటికే చాలా వైరస్లు పరివర్తన చెందుతుంటాయని ఆయన వెల్లడించారు. వాతావరణ మార్పులు, జనాభా విస్ఫోటనం సహా ఇతర చర్యల వల్ల భవిష్యత్త్లో ఈ డిసీజ్ ఎక్స్ మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని తట్టుకునేందుకు నియంత్రణ చర్యలు చాలా కీలకమని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కరోనా మహమ్మారి చూసి తీవ్రంగా భయపడుతున్న ప్రజలు.. దానికంటే 7 రెట్లు అధిక తీవ్రత కలిగినడిసీజ్ ఎక్స్ పేరు వింటేనే భయపడిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa