ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కార్పియో ప్రమాదం.. ఎయిర్‌బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదో చెప్పిన మహీంద్రా కంపెనీ

national |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 08:23 PM

మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాపై ఇటీవల దాఖలైన చీటింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరణతో ఆ కంపెనీ తాజాగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. 2020 లో మహీంద్రా స్కార్పియో కారు ప్రమాదానికి గురై అందులో ఉన్న ఓ వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తి తండ్రి ఆనంద్ మహీంద్రాతోపాటు మరో 12 మంది కంపెనీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను.. ఆ ఘటనపై తమ కంపెనీ జరిపిన దర్యాప్తును వివరించింది. ఈ ఘటనలో స్కార్పియో వాహనంలో ఎయిర్‌బ్యాగులకు సంబంధించి ఎలాంటి లోపాలు తలెత్తలేదని మహీంద్రా కంపెనీ స్పష్టం చేశారు. సెప్టెంబరు 23 వ తేదీన నమోదైన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న దాదాపు రూ. 20 లక్షల విలువైన స్కార్పియో కారుకు సంబంధించి భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేవని మరోసారి స్పష్టం చేసింది.


అయితే ఈ కేసు 18 నెలల కిందటిది అని మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ సంఘటన 2022 జనవరిలో జరిగిందని.. ప్రమాదానికి గురైన స్కార్పియోలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ప్రమాదంలో స్కార్పియో వాహనం బోల్తా పడడంతో కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని తెలిపింది. 2020 లో తయారైన స్కార్పియో S9 వేరియంట్‌ వాహనంలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని ధ్రువీకరించింది. అయితే ఈ ఘటనపై మహీంద్రా కంపెనీకి చెందిన టెక్నికల్ టీమ్.. 2022 అక్టోబర్‌లో పూర్తి దర్యాప్తు నిర్వహించి వివరాలు సేకరించినట్లు చెప్పింది. తమ పరిశీలనలో ప్రమాదానికి గురైన స్కార్పియోలో ఎయిర్‌బ్యాగ్‌ల లోపం లేదని తేలిందని.. అయితే వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగులు ఓపెన్‌ కావని వెల్లడించింది.


మరోవైపు.. ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది. ఈ కేసు విచారణలో న్యాయపరంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన బాధితుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన రాజేష్‌ మిశ్రా అనే వ్యక్తి సెప్టెంబర్ 23 వ తేదీన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సహా మరో 12 మంది ఉద్యోగులపై ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కుమారుడి మృతికి కారణం మహీంద్రా కంపెనీ అని.. కారు ప్రమాదానికి గురైనపుడు అందులో ఉన్న ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాలేదని.. అసలు అందులో ఎయిర్ బ్యాగులు లేవని రాజేష్ మిశ్రా తన ఫిర్యాదులో ఆరోపించారు. తన కుమారుడు డాక్టర్ అపూర్వ్‌కు బ్లాక్‌ స్కార్పియో కారును గిఫ్ట్‌గా ఇవ్వగా.. 2022 జనవరి 14 వ తేదీన అపూర్వ్‌ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అపూర్వ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ అపూర్వ్ తండ్రి రాజేష్ మిశ్రా ఇటీవల ఫిర్యాదు చేశారు. మహీంద్రా కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్‌ మహీంద్రాతో పాటు 12 మంది ఇతర ఉద్యోగులపై చీటింగ్ కేసు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa