తిరుమలలో చిరుతల సంచారం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న అటవీశాఖ అధికారులకు మరో తలనొప్పి వచ్చి పడింది. తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమలేశుడి పాదాల చెంత కొలువైన ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కదలికలు విద్యార్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వేళ యూనివర్సిటీలోని ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కనిపించడమే విద్యార్థుల భయానికి కారణం. ఈ నేపథ్యంలో... ఎప్పుడు ఏవైపు నుంచి చిరుత వస్తుందోనని యూనివర్సిటీలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి వేళ వర్సిటీలోని ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కనిపించింది. చిరుత కదలికలు.. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో విద్యార్థుల్లో మళ్లీ భయం మొదలైంది. ఆగస్ట్ నెలలోనూ వర్సిటీలో చిరుత సంచారం అలజడి రేపింది. అప్పట్లో ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్లో చిరుతపులి కనిపించింది. దీంతో భయపడిపోయిన విద్యార్థులు వర్సిటీ యాజమాన్యానికి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. తాజాగా మరోసారి ఎస్వీయూనివర్సిటీలో చిరుత కదలికలు కలకలం రేపాయి. అయితే పదేపదే వర్సిటీలో చిరుతపులి సంచరిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు, వర్సిటీ యాజమాన్యం స్పందించి భద్రతాచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa