ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మఒడి పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. మీరూ మోసపోతారు జాగ్రత్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 07:42 PM

ఏపీలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులమని చెబుతూ ఫోన్ కాల్స్ చేసి నిండా ముంచేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది.కంబాలచెరువు ఆదమ్మ దిబ్బ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్‌ నగరంలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రంలో ఆయన భార్య రత్నకుమారికి ఈ నెల 18న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి అమరావతి క్యాంపు కార్యాలయం అమ్మఒడి విభాగం నుంచి కాల్‌ చేస్తున్నట్లు చెప్పాడు. 'మీ కుమారుడికి అమ్మఒడి వచ్చింది.. బ్యాంకు వివరాలు తెలియజేస్తే డబ్బుల్ని అకౌంట్‌కి జమ చేస్తాం' అని చెప్పారు.


ఆమె నిజమని నమ్మి బ్యాంకు వివరాలు తెలియజేసింది. ఆ తర్వాత వచ్చిన ఓటీపీ కూడా వారికి చెప్పింది. నిమిషాల వ్యవధిలో బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.42 వేలు మాయం అయ్యాయి. మొబైల్‌కు మెసేజ్ రావడంతో అనుమానం వచ్చింది. తాను ఓటీపీ చెప్పగానే డబ్బులు డెబిట్‌ కావడం.. మళ్లీ కొద్దిసేపటి తర్వాత అదే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మళ్లీ ఓటీపీ వస్తుంది అది కూడా చెప్పాలని అడిగాడు. ఆమెకు అనుమానం రావడంతో అప్రమత్తమై ఫోన్‌ కట్‌ చేసింది. అనంతరం భర్త సహకారంతో బ్యాంకు సిబ్బందిని సంప్రదించారు.. అకౌంట్‌లో రూ.5.24 లక్షలు ఉన్నాయని.. ఆన్‌లైన్‌లో చెప్పిన ఓటీపీతో రూ.42 వేలు మాత్రమే చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


గతంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఈ తరహా మోసాలు జరిగాయి. ప్రభుత్వ పథకాలు అందనివారికి ఫోన్ కాల్స్ చేసి ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు అమాయకంగా బ్యాంకు వివరాలు చెప్పి ఇలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ అనుమానాస్పందంగా ఏవైనా కాల్స్ వస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa