ఈశాన్య రాష్ట్రం సిక్కిమ్లో మంగళవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలోని లోనక్ లేక్ ప్రాంతంలో ఆకాశానికి చిల్లుపడినట్టు కురిసిన వర్షానికి తీస్తా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి లాచెన్ వ్యాలీలో ఉన్న సైనిక స్థావరాలు కొట్టుకుపోయాయి. మొత్తం 23 మంది జవాన్లు గల్లంతయ్యారని రక్షణ శాఖ గువాహటి కార్యాలయం వెల్లడించింది. కొన్ని సైనిక వాహనాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయని తెలిపింది. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
చుంగ్థంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపింది. నదిలో ప్రవాహం సాధారణం కంటే 15-20 అడుగులు ఎక్కువగా ఉందని, సింగ్థమ్ సమీపంలోని బర్దంగ్ ప్రాంతంలో సైనిక వాహనాలు పార్క్ చేశామని, వరద ధాటికి అవి ప్రభావితమయ్యాయని రక్షణ శాఖ వివరించింది. రాత్రంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి ఎక్కడక్కడ రహదారులు కొట్టుకుపోయాయి. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిక్కిమ్ అధికార యంత్రాంగం సూచించింది.
రోడ్లు కొట్టుకుపోయిన ఘటనలు, నది ఉధృతంగా ప్రవహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాన్ని సిక్కిమ్ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ బుధవారం ఉదయం సందర్శించారు. వర్షం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కానీ, ప్రజా ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లిందని తెలిపారు. ‘సింగ్టామ్లో కూడా కొంతమంది తప్పిపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.
సిక్కింలోని చుంగ్తాంగ్లోని సరస్సు పొంగిపొర్లడంతో తీస్తా నదికి వరద ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ‘గజోల్డోబా, దోమోహని, మెఖలిగంజ్, ఘిష్ వంటి లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa