ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్,,,,బ్రహ్మోత్సవ బహుమానం కూడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 06:20 PM

టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీటీడీలోని అర్హులైన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు.. అర్హత ఉన్న ఉద్యోగులను టీటీడీలో క్రమబద్దీకరణ చేస్తామని ఛైర్మన్ భూమన ప్రకటించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హోమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తామని.. హోమంలో పాల్గొనే భక్తులు రూ.వెయ్యి చెల్లించి టిక్కెట్టు పొందవలసి ఉంటుందని తెలిపారు.


టీటీడీ శాశ్వత ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు అందించాలని.. ఒప్పంద ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం రూ. 6.850 ఇచ్చేందుకు పాలకమండలి అంగీకారం తెలిపిందన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25.67 కోట్లు కేటాయిస్తున్నామని.. ఈ సొమ్మును తిరిగి ఉద్యోగులు నుంచి రీయింబర్స్ చేసుకుంటామని చెప్పారు. టీటీడీలో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలం కేటాయిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు.


టీటీడీ పాలకమండలి తీసుకున్న మిగిలిన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.. తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు రూ.6.15 కోట్లు కేటాయించారు. ప్రసాదాలు, ముడిసరుకులు నిల్వ ఉంచడానికి రూ.11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మాణానికి అంగీకారం తెలిపారు. మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు కేటాయించారు. ఎంఆర్‌పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.4.5 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పుదిపట్ల జంక్షన్ నుంచి వకులమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణంకు రూ.21 కోట్ల పనులకు ఓకే చెప్పారు.


ఆయుర్వేద హాస్పిటల్‌లో రూ.1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం..రుయాలో టిబి రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్విమ్స్‌లో రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం.. స్విమ్స్‌లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్‌ల ఏర్పాటుకు రూ.74 కోట్లు కేటాయించారు. స్విమ్స్‌లో రూ.197 కోట్లతో నూతన ఆధునాతమైన భవనాలు నిర్మాణం.. నడకదారిలో భక్తుల భధ్రత కోసం రూ.3.5 కోట్ల వ్యయంతో ట్రాప్ కెమెరాల కోనుగోలకు ఆమోదం తెలిపారు. కరీంనగర్‌లో పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్లు కేటాయించారు. ప్రాచీన కళలు ప్రోత్సహించడానికి కలంకారి, శిల్పకళల కోసం సాయంకాలం కోర్సులు ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa