ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో మరోసారి చిరుత కలకలం,,,మెట్టు మార్గంలో సంచరిస్తున్నట్లు గుర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 06:24 PM

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలంరేపింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించినట్లు భక్తులు చెబుతున్నారు. పులివెందులకు చెందిన భక్తులు మెట్టు మార్గం వైపుగా వెళుతుండగా.. చిరుత వేగంగా రోడ్డు దాటుతున్నట్లు చెప్పారు. వెంటనే భక్తులు అప్రమత్తమై టీటీడీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ.. కాలినడక భక్తులను గుంపులు, గుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్ హౌస్ దగ్గర భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు.. మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనలో ఉన్నారు.


తిరుమల నడక మార్గాల్లో చిరుతల టెన్షన్ వెంటాడుతోంది. జూన్ నెలలో బాలుడిపై చిరుత దాడి చేయగా.. ఆ తర్వాత ఆగస్టు నెలలో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసి చంపేసింది. ఈ ఘటన రెండు ఘటనల తర్వాత టీటీడీ మరింత అప్రమత్తం అయ్యింది. వెంటనే బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించింది. అలాగే నడక మార్గాల్లో కొన్ని నిబంధనల్ని అమలు చేస్తోంది.


మరోవైపు చిరుతల నుంచి రక్షణ కోసం టీటీడీ కర్రల్ని పంపిణీ చేస్తోంది. నడకమార్గాల్లో భక్తుల్ని గుంపులుగా పంపిస్తున్నారు. అవసరమైన చోట గార్డుల్ని కూడా నియమించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్లలోపు చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల్ని వారి తల్లిదండ్రులతో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. పెద్దవారిని కూడా రాత్రి 10 గంటల తర్వాత అనుమతించడం లేదు. అలాగే తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్లలో బైకుల్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించగా.. ఇటీవల ఆ నిబంధనను సడలించారు.


అంతేకాదు తిరుమలకు వెళ్లే నడక మార్గాల్లో.. భక్తులు సాధు జంతువులకు తిను బండారాలను అందించొద్దని టీటీడీ సూచిస్తోంది. ఒకవేళ ఎవరైనా అలా ఆహార పదార్థాలు జంతువులకు అందించినా.. ఆహార పదార్థాలు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నడక మార్గాల్లో ఉన్న హోటళ్ల నుండి వ్యర్ధాలు వదిలివేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇప్పటికే టీటీడీ తనిఖీలు కూడా చేపట్టింది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.


అంతేకాదు చిరుతలు, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు.. వాటిని పట్టుకునే పనిలో ఉన్నారు. అలాగే భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. గతంలో అలిపిరి మార్గంలో చిరుతల సంచారం ఉంటే.. ఇప్పుడు మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa