ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ముందు తీవ్ర దుమారం.. కేంద్రమంత్రి కుమారుడి వీడియోలు వైరల్

national |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 11:09 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్‌కు సంబంధించిన వీడియోలు వరుసగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అయితే ఈ వీడియోలపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా.. అవన్నీ ఫేక్ వీడియోలు అంటూ అధికారంలో ఉన్న బీజేపీ కొట్టి పారేస్తోంది.


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర సింగ్‌ తోమర్‌.. దిమనీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది బిజినెస్‌మెన్‌లతో నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుమారుడు, దేవేంద్ర సింగ్‌ తోమర్‌.. రూ.కోట్ల వ్యవహారం గురించి మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై చర్చ, దుమారం చోటు చేసుకుంటుండగానే అలాంటిదే మరో వీడియో బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఎన్నికల పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు ఈ వ్యవహారం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ వీడియోలపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.


గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ లాగానే మధ్యప్రదేశ్‌లో కూడా అవినీతి ప్రభుత్వం పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాగినీ నాయక్ తీవ్ర విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 50 శాతం కమీషన్‌ సర్కార్‌గా మారిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ వీడియోలను ఫేక్ వీడియోలు అని చెబుతున్న బీజేపీ.. వాటిని ఎవరు వైరల్‌ చేశారనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వీడియోలపై మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. బహిరంగంగానే బీజేపీ నేత లంచం డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వీడియోలు బయటికి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. నరేంద్ర సింగ్ తోమర్‌ కుమారుడిపై ఈడీ, సీబీఐ, ఐటీలను పంపుతుందా అని రాహుుల్ ప్రశ్నించారు.


అయితే ఈ వీడియోలు, వివాదంపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ తాజాగా స్పందించారు. అవన్నీ ఫేక్ వీడియోలను.. అలాంటి వాటిపై చర్చలు నిర్వహించి సమయాన్ని వృథా చేయకూడదంటూ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై స్పందించిన నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్‌ తోమర్.. అది ఫేక్‌ వీడియో అని స్పష్టం చేశారు. అయితే ఈ వీడియోలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. మరోవైపు.. ఈ వ్యవహారంలో బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలను కమలం పార్టీ తిప్పికొట్టింది. దేవేంద్ర సింగ్ తోమర్ వీడియోలపై ఫిర్యాదు చేశామని.. వాటిపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. ఇలాంటి వ్యూహాలతో ఎన్నికల్లో గెలవలేరని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ పార్టీనే అవినీతిలో కూరుకుపోయిందని.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న 15 నెలల కాలంలో రూ.281 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa