ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామాలయ ఆకారంలో అయోధ్య రైల్వేస్టేషన్.

national |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 11:15 PM

అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రామాలయ ప్రారంభోత్సవ తేదీని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించినప్పటి నుంచి అయోధ్యకు చేరుకునేందుకు.. అక్కడ బస చేసేందుకు దేశ వ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల్లో ఉన్న హిందువులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఇండియన్ రైల్వే పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే పనులు దాదాపు పూర్తి కాగా.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందే ఈ రైల్వే స్టేషన్ సేవలు అందించనుంది.


రామాలయంలోరామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జనవరి 22 వ తేదీన జరగనుండగా.. దానికి వారం రోజుల ముందుగానే అంటే.. జనవరి 15 వ తేదీ నాటికి అయోధ్య రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఇండియన్ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. 2019 లో అయోధ్య రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు ఇండియన్ రైల్వే పనులు ప్రారంభించింది. రూ.241 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. కొత్త రైల్వే స్టేషన్‌లో షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, పార్కింగ్ సహా ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆకారంలోనే ఈ పునర్నిర్మించిన రైల్వే స్టేషన్‌ను తీర్చి దిద్దుతున్నారు. రోజుకు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సరికొత్త అయోధ్య రైల్వే స్టేషన్ డిజైన్ ప్రకారం.. మొత్తం 3645 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టేషన్ నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 2 అంతస్తుల్లో ఈ రైల్వే స్టేషన్ నిర్మితం అవుతోంది. ప్లాట్‌ఫామ్‌లను మరింత మెరుగుపరుస్తున్నారు. 6 మీటర్ల వెడల్పు గల 2 అంతస్థుల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉంటాయి. కొత్తగా ఏర్పాటవుతున్న అయోధ్య రైల్వే స్టేషన్‌లో 12 లిఫ్ట్‌లు, 14 ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను రక్షించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. స్టేషన్‌లోకి ప్రయాణికులు రావడం, బయటికి వెళ్లేందుకు వేర్వేరుగా గేట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ అయోధ్య రైల్వే స్టేషన్‌ను కూడా జనవరి 15 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa