ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్,,,,2.8 కి.మీ. దూరంలో చిక్కుకున్న 40 మంది కార్మికులు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 11:31 PM

ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాద ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నారు. రెండు రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా.. లోపలి ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన పెరుగుతోంది. ఇకపై ప్రతీ గంట అత్యంత కీలకమని అధికారులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున యమునోత్రి మార్గంలోని నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, బీఆర్‌వోలకు చెందిన 150 మందికిపైగా సిబ్బంది భాగస్వామ్యులయ్యారు. ఈ ఆపరేషన్ నిర్విరామంగా 48 గంటల నుంచి కొనసాగుతోంది.


అయితే, రెస్క్యూ పూర్తయి లోపలి బాధితులు బయటపడటానికి మరో 24 గంటల పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం సెక్రెటరీ రంజిత్ సిన్హా.. బాధితులు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడినట్టు సమాచారం లేదన్నారు. వారికి పైపుల ద్వారా ఆక్సిజన్, ఆహార పొట్లాలు, తాగునీరు అందజేస్తున్నామని సిన్హా తెలిపారు. వాకీటాకీల ద్వారా వారితో మాట్లాడుతున్నట్టు చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న వారంతా ఇప్పటివరకు క్షేమంగా ఉన్నారని అన్నారు.


ఉత్తరకాశీ జిల్లాలోని సిల్కియారా, దండల్‌గావ్‌లను కలుపుతూ ఈ సొరంగం నిర్మిస్తున్నారు. సొరంగంలోకి 15 మీటర్ల దూరం వరకు వెళ్లామని, మరో 35 మీటర్లు వెళ్లాల్సి ఉందని ఆయన వివరించారు. కూలీల్లో ఒకరు మాత్రమే ఉత్తరాఖండ్‌కు చెందినవారు కాగా.. మిగతావాళ్లు బిహార్, పశ్చిమ్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు.షాట్‌క్రీట్‌ను ఉపయోగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి కూలిన శిథిలాలు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో శిధిలాల మీద కాంక్రీటును స్థిరీకరించడం కోసం స్ప్రే చేస్తున్నారు. హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ అతుల్ కుమార్ మాట్లాడుతూ.. ‘రెండు ఎంపికలు టేబుల్‌పై ఉన్నాయి.. షాట్‌క్రీట్‌తో వదులుగా ఉన్న శిథిలాలను తొలగించడం లేదా తరలింపు కోసం హైడ్రాలిక్ జాక్‌తో 900mm (మూడు అడుగుల) వ్యాసం కలిగిన స్టీల్ పైపును ఉపయోగించడం’ అన్నారు. ఈ పైపులను హరిద్వార్, డెహ్రాడూన్ నుంచి సోమవారం రాత్రికి సైట్‌కు చేరుకున్నాయి. మరోవైపు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించి.. జేసీబీ, ప్రొక్లెయిన్‌ మిషన్లతో 13 మీటర్ల వెడల్పున తవ్వుతున్నట్టు అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com