2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. అత్యంత దుర్బల గిరిజన బృందాల (పీవీటీజీ) పరిపూర్ణ సంక్షేమం కోసం నవంబరు 15న ఝార్ఖండ్లో రూ.24,000 కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అత్యంత దుర్బల గిరిజన తెగలకు చెందిన 28 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 220 జిల్లాల్లో 75 అత్యంత దుర్బల గిరిజన తెగలు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది.
వీరంతా అడవులు, పర్వతాల్లోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇప్పటికే వీరి కోసం పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 11 రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు దీనిని పీవీటీజీలకు వర్తింపజేస్తారు. ఇక, నవంబరు 14న ఝార్ఖండ్లో రెండు రోజుల పాటు పర్యటించే ప్రధాని నరేంద్ర మోదీ... 15న ప్రముఖ గిరిజన నేత భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పీవీటీజీ పథకాన్ని ప్రారంభిస్తారు. బిర్సా ముండా జయంతిని కేంద్రం 2021 నుచి ‘జనజాతీయ గౌరవ్ దివాస్’ పేరుతో నిర్వహిస్తోంది.
బిర్సా ముండా జన్మస్థలానికి వెళ్లిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు. కుంతి జిల్లా ఉలిహటులో జరిగే బిర్సా ముండా జయంతి వేడుకల్లో పీవీటీజీ మిషన్, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే విక్సిత్ భారత్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుడతారు. ఇక, 2023-24 బడ్జెట్లో గిరిజనుల సంక్షేమం కోసం పీవీటీజీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోస రూ.22,544 కోట్లను కేటాయించారు. అత్యంత దుర్బల గిరిజన బృందాలు నివాసం ఉండే ప్రాంతాల్లో రహదారులు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్, పక్కా ఇళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను చేపడతారు.
ఇక, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల ప్రయోజనాలు, లబ్దిదారుల నమోదుపై గిరిజన వర్గాలకు అవగాహన కల్పించడమే సంకల్ప యాత్ర ముఖ్యోద్దేశం. గిరిజనుల ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఈ యాత్రను ప్రారంభించి.. వచ్చే ఏడాది జనవరి 25 నాటికి దేశంలోని అన్ని జిల్లాల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత నిధులను కూడా మోదీ విడుదల చేయనున్నారు. దేశంలోని 8 కోట్ల మంది లబ్దిదారులకు మొత్తం రూ.18,000 కోట్లు నిధులు మంజూరు చేస్తారు. దీంతో ఝార్ఖండ్లోని రూ.7,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa