గడచిన రెండు వారాలుగా దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానాన్ని అధిరోహించింది. దీంతో పాటు బెంగాల్ రాజధాని కోల్కతా, దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరాలు కూడా టాప్-10 లోకి చేరాయి. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి 400పైగా నమోదవుతుంటే.. ముంబయి, కోల్కతా నగరాల్లో ఏక్యూఐ 200 దరిదాపుల్లో ఉంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్యాలిటీ అండ్ వెదర్ ఫోర్క్యాస్టింగ్ అండ్ రిసెర్చ్ (సఫర్) తాజా నివేదిక ప్రకారం.. బుధవారం ముంబయిలో వాయు నాణ్యత సూచీ 198గా నమోదయ్యింది.
నగరంలో అత్యధిక ఉష్ణోగ్రత దాదాపు 34 డిగ్రీలు.. కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఇక, చెంబూరులో అత్యధికంగా వాయు నాణ్యత సూచీ 308గా నమోదుకావడం గమనార్హం. బంద్రా-కుర్లాలో ఏక్యూఐ 246, వసాయ్ వెస్ట్లో 244, మలద్ వెస్ట్లో 241, బైకుల్లాలో 221, కాండివలీ ఈస్ట్ 216, కోలాబాలో 214, డియోనిర్ 205, బోరివలీ ఈస్ట్లో 200, మజ్గావ్లో 197కు చేరింది. మరోవైపు, వచ్చే ఏడు రోజులు ముంబయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34-36 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 22-23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది.
కాగా, వాతావరణంలో కాలుష్య తీవ్రతను గాలి నాణ్యత సూచీ ఆధారంగా అంచనా వేస్తారు. గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే కాలుష్యరహిత పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు పరిగణిస్తారు. 50-100 మధ్య ఉంటే స్వల్ప కాలుష్యం, 101-200 ఉంటే సాధారణం.. 201-300 ఉంటే తీవ్రమైన, 301- 400 ఉంటే చాలా తీవ్రమైన, 401-450 అతి తీవ్రమైన, 450 దాటితే అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ఏక్యూఐ 400 దాటితే ఆరోగ్యవంతులపై కూడా తీవ్ర ప్రభావం. ఇక ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వారికి అత్యంత ప్రమాదకరమని చెబుతారు. 150 నుంచి 200 ఏక్యూఐ మధ్య వాయు నాణ్యత నమోదైతే ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa